న్యూఢిల్లీ : భారత్ లో అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్ వ్యాపిస్తుందని, చిన్నారులపై దీని ప్రభావం ఉంటుందని రాయ్ టర్స్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ప్రొఫెసర్లతో కూడిన 40 మంది ప్రొఫెషనల్స్ తో ఈ స్నాప్ సర్వేను నిర్వహించారు. దవాఖానలు, ఆక్సిజన్, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండటంతో తదుపరి కరోనా వైరస్ వేవ్ ను మెరుగ్గా కట్టడి చేయవచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది అభిప్రాయపడ్డారు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతుండటంతో వైరస్ కేసుల సంఖ్య తక్కువగా ఉండవచ్చని ఈ సర్వేలో పాల్గొన్న ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతుండటంతో కేసులు తక్కువగా వస్తాయని వాటిని నియంత్రించడం తేలికవుతుందని అన్నారు. సెకండ్ వేవ్ వ్యాప్తితో కొంతమేర సహజ రోగనిరోధకశక్తి సమకూరిందని పేర్కొన్నారు.
ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది అక్టోబర్ లో భారత్ లో థర్డ్ వేవ్ తలెత్తుతుందని చెప్పగా, ఆగస్ట్ లోనే వస్తుందని ముగ్గురు, సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ ఉంటుందని 12 మంది అంచనా వేశారు. ఇక నవంబర్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తదుపరి ఇన్ఫెక్షన్లు ఉంటాయని సర్వేలో పాల్గొన్నవారిలో ముగ్గురు చెప్పుకొచ్చారు. సర్వేలో పాల్గొన్న 40 మందిలో 26 మంది థర్డ్ వేవ్ 18 ఏండ్లలోపు వారిపై ప్రభావం చూపుతుందని చెప్పారు. అయితే థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపదని 14 మంది వైద్య నిపుణులు స్పష్టం చేశారు.