హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ప్రపంచ దేశాలనుంచి వచ్చే పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఏడేండ్లుగా తమ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక, పెట్టుబడి అనుకూల, స్నేహపూర్వక విధానాలవల్ల వివిధ దేశాలనుంచి అగ్రశ్రేణి సంస్థలు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టాయని వివరించారు. సోమవారం సౌదీలోని భారత రాయబార కార్యాలయం తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ మీట్ పేరుతో ఏర్పాటుచేసిన రెండు రోజుల సదస్సులో మంత్రి కేటీఆర్ వర్చువల్ పద్ధతిలో పాల్గొని ప్రారంభోపన్యాసంచేశారు. సౌదీలోని భారత రాయబార కార్యాలయం అక్కడి కంపెనీలతోపాటు సౌదీ ఇండియా బిజినెస్ కౌన్సిల్ వంటి పారిశ్రామిక సంస్థలతో కలిపి ఈ పెట్టుబడి మీట్ను ఏర్పాటుచేసింది. సదస్సు సందర్భంగా రాష్ట్రంలో వివిధరంగాల్లో ప్రభు త్వం కల్పిస్తున్న సౌకర్యాలు, పెట్టుబడికి ఉన్న అవకాశాలపై సమగ్ర వివరాలను అధికారులు అక్కడి పెట్టుబడిదారులకు అందిస్తారు.
భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన టీఎస్ ఐ-పాస్ వంటి సింగిల్ విండో అనుమతుల విధానాన్ని తెలంగాణ అమలుచేస్తున్నదని, దీనిద్వారా ఇప్పటికే 2,200 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తద్వారా 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, రెన్యువబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సౌదీ వంటి అరబ్ దేశాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సౌదీ వంటి అరబ్ దేశాలతో భారతదేశానికి అవినాభావ సంబంధం ఉన్నదని గుర్తుచేస్తూ, దేశంలోని లక్షల మంది అరబ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారన్నారు. సౌదీతో తెలంగాణ వ్యాపార- వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసిన సౌదీ రాయబారి అసఫ్ సయీద్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఐదేండ్లుగా అద్భుత ప్రగతి : అసఫ్
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నూతన రాష్ట్రం అయినప్పటికీ గత ఐదేండ్లుగా అద్భుత పారిశ్రామిక ప్రగతిని సాధిస్తూ దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచిందని సౌదీ రాయబారి అసఫ్ సయీద్ ప్రశంసించారు. సౌదీలో ఉన్న కంపెనీలకు తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. మంత్రి కోరికపై తాము ఆ దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ సదస్సు పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సౌదీ అరేబియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఖతానీ, సౌదీ ప్రభుత్వానికి చెందిన అల్ హస్నా, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి రాకేశ్సర్వాల్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నూతన రాష్ట్రం అయినప్పటికీ గత ఐదేండ్లుగా అద్భుత పారిశ్రామిక
ప్రగతిని సాధిస్తూ దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచింది. సౌదీలో ఉన్న కంపెనీలకు తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. మంత్రి కోరికపై మేము ఆ దిశగా కృషి చేస్తున్నాం. ఈ సదస్సు పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను.
– సౌదీ రాయబారి అసఫ్ సయీద్