హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని మెదక్ జాయింట్ కలెక్టర్ రమేశ్ తెలిపారు. 2018లో అనుమతులు లేకుండా జమున హ్యాచరీస్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. 2018లో అచ్చంపేటలోని సర్వే నం. 55తో పాటు సర్వే నం. 123 నుంచి 129 వరకు లే అవుట్ కోసం అప్పటి పంచాయతీ కార్యదర్శిపై ఒత్తిడి తీసుకొచ్చి సంతకం చేయించుకున్నారు. 2019లో సర్వే నం. 130లోని భూమిని కూడా నాటి పంచాయతీ కార్యదర్శిని బలవంతం పెట్టి సంతకాలు తీసుకున్నారు. ఆ ఇద్దరి పంచాయతీ కార్యదర్శుల వాంగ్మూలాన్ని ఇవాళ మాసాయిపేట తహసీల్దార్ మాలతి సమక్షంలో రికార్డు చేశామని తెలిపారు. సర్వే నం. 111లో ఎలాంటి అనుమతి లేకుండా ఫీడ్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. జమున హ్యాచరీస్ భూములపై డీపీవో ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. విచారణ తదుపరి అవకతవకలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జేసీ రమేశ్ పేర్కొన్నారు.
అచ్చంపేట, హకీంపేట పంచాయతీ కార్యదర్శుల వాంగ్మూలాన్ని రికార్డు చేశామని మాసాయిపేట, వెల్దుర్తి తహసీల్దార్లు మాలతి, సురేశ్ తెలిపారు. 2018లో తీసుకున్న ఎన్వోసీకి, 2019లో తీసుకున్న ఎన్వోసీకి పొంతన లేదని స్పష్టం చేశారు. అప్పటి పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్వోసీ తీసుకున్నారు. సర్వే నం. 111లో జమున హ్యాచరీస్ అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చామన్నారు. రెండు సార్లు నోటీసులిస్తే మూడోసారి వివరణ ఇచ్చారు. అనుమతి లేకుండా ఫీడ్ ప్లాంట్ కట్టారు. దానిపై విచారణ కొనసాగుతోందన్నారు. 95.22 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి 75 మందికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. అసైన్డ్ భూముల అక్రమాలపై ఈ నెల 25న రైతులను విచారిస్తామన్నారు. అచ్చంపేటలోని సర్వే నం. 77-81 వరకు, సర్వే నం. 115, 130లలో, హకీంపేటలోని సర్వే నం. 97లలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో సర్వే నిర్వహిస్తామన్నారు.