హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): దేవరయాంజాల్ ఆలయ భూములపై దర్యాప్తులో ఎండోమెంట్ అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ప్రధానంగా అవుకాఫ్ రిజిస్టర్పై ఎండోమెంట్లో చర్చ జోరందుకొన్నది. ఆలయాలు, మసీదులు, ఈద్గాలు, శ్మశానాలు, మఠాలు, ధర్మశాలలను ‘కితాబ్ ఉల్ అవుకాఫ్ బోరు’్డ కింద రిజిస్ట్రేషన్ చేయాలని 1925లో నిజాం ప్రభుత్వం (1331-1359 ఫస్లీ) ‘ఆఫీస్ ఆఫ్ ది సెక్రటరీ – ఎండోమెంట్ డిపార్ట్మెంట్’ ఎక్లస్టికల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ హైదరాబాద్ (హెచ్ఈహెచ్ ది నిజాం) గవర్నమెంట్ పేరిట ఉత్తర్వులు విడుదల చేసింది. దీని ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తే పన్ను మినహాయింపుతోపాటు ఆలయాలకు, మాన్యాలకు భద్రత ఉంటుందనేది ఆ ఉత్తర్వులు సారాంశం. తెలంగాణలోని ఆలయాల వివరాలు, వాటి ఆస్తిపాస్తులు, ఆభరణాల వివరాలు ఈ రిజిస్టర్లో పొందుపర్చారు. ఆ రికార్డులనే ‘అవుకాఫ్’ రికార్డులంటారు.
అవుకాఫ్ రిజిస్టర్ ఉంటే దేవరయాంజాల్లోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం మాన్యాలు, ఆస్తులతోపాటు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ రికార్డులను ఉమ్మడి రాష్ట్రంలో ఎండోమెంట్లో చక్రం తిప్పిన ఓ అధికారి (ప్రస్తుతం ఏపీలో ఉంటూ రూ.100కోట్ల అక్రమాస్తులతో ఏసీబీకి చిక్కాడు) కనుసన్నల్లో పనిచేసిన కొందరు (ప్రస్తుతం తెలంగాణ ఎండోమెంట్లో ఉన్నారు) అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రిజిస్టర్లను మాయం చేసి ఉంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో సమాచార హక్కుచట్టం కింద ఈ అవుకాఫ్ రికార్డులను అందించాలని కొందరు దరఖాస్తు చేసినా అప్పటి ఎండోమెంట్ అధికారులు స్పందించలేదనే ఆరోపణలున్నాయి. ఈ అవుకాఫ్ రికార్డుల జాడ తెలుసుకొనేందుకు ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించాలని తెలంగాణ రాష్ట్ర దేవాలయాల పరిరక్షణ సమితి అద్యక్షుడు నాగిళ్ల శ్రీనివాస్ కోరారు.