హైదరాబాద్: సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, వారి కొత్త ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి కొత్త ఆలోచనలకు పదును పెట్టడం, వాటికి సృజనాత్మకతను జోడించి ఆవిష్కరణలు చేపట్టే వారిని ప్రోత్సహిండానికి ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. దీనికి సంబంధించి దరఖాస్తు గడువును ఆగస్టు 10 వరకు పొడిగించారు. ఇందులో పాఠశాలలు, కళాశాల స్థాయిలోని విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, మెకానిక్లు, వ్యవసాయదారులు, మహిళలు ఇలా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభకు రూపం ఇచ్చేలా వారిని ప్రోత్సహించడం కోసం 2019-20 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్ విభాగం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల ప్రదర్శన చేపట్టనున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.
ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, దానికి సంబంధించి రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణ నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు, 9100678543 నంబర్కు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వాటిని షార్ట్లిస్ట్ చేస్తారు. స్వాతంత్య్ర దినోత్సవ రోజున ఆవాటిని ఆన్లైన్లో ప్రదర్శిస్తారు. వాటిలో ప్రతిజిల్లా నుంచి ఉత్తమ ఆవిష్కరణలను ఎంపికచేస్తారు.