ఆధిపత్యం.. అసంతృప్తి. వామపక్షవాదం.. అతివాదం. అవినీతి.. సైద్ధాంతిక ప్రాతిపదిక. వీటన్నింటి మధ్య రాష్ట్ర బీజేపీ కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంలో తీవ్రస్థాయిలో లుకలుకలు బయటపడుతున్నాయి. రాష్ట్రంలోని జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి నాయకుల మధ్య అసంతృప్తులు పరాకాష్టకు చేరు
కొన్నాయి. పార్టీ వ్యవహారాల్లో, కొత్తగా చేర్చుకొనే నాయకుల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని పలువురు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలపై పదవీచ్యుతుడైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ను చేర్చుకోవాలన్న ప్రతిపాదనలపై పార్టీ నాయకుల్లో తీవ్రస్థాయిలో విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీ సైద్ధాంతిక భావాలకు పూర్తి వ్యతిరేకంగా వామపక్ష భావజాలం కలిగి.. బడుగుల భూమిని ఆక్రమించుకొన్న నేతగా అపఖ్యాతిపాలైన వ్యక్తిని ఎలా చేర్చుకొంటారని చర్చ జరుగుతున్నది.
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): అవినీతి, అక్రమాలతో మంత్రి పదవిని కోల్పోవడంతోపాటు, టీఆర్ఎస్ను వీడిన ఈటల వ్యవహారం రాష్ట్ర బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ముఖ్యంగా మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకత్వం ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. ఎక్కే గడప.. దిగే గడపగా మారిన ఈటల రాజకీయ వ్యవహారంతో బీజేపీలో అగ్గి రాజుకొంటున్నది. ఇది పార్టీలో తీవ్రస్థాయి ముఠాపోరుకు దారితీసి, చీలికల వరకు పోయినా ఆశ్చర్యం లేదని పార్టీ నేతలే అంటున్నారు.
అసంతృప్తిలో ఆర్ఎస్ఎస్ శ్రేణులు
ఇప్పటివరకు లెఫ్ట్ పార్టీలతో పోరాటాలు చేశాం.. ఇప్పుడు అదే కరుడుగట్టిన లెఫ్టిస్టును పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారంటూ బీజేపీకి మాతృక అయిన ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లోనూ, అతివాద నాయకుల్లో తీవ్ర మథనం సాగుతున్నది. పార్టీ సైద్ధాంతికత ఏమైపోవాలని ప్రశ్నిస్తున్నారు. భూకబ్జాలతో ప్రజల ముందు దోషిలా నిలిచిన ఈటల ఫక్తు లెఫ్టిస్టు అనేది అందరికీ తెలిసిన విషయమేనని, అలాంటి వ్యక్తికి పార్టీలోకి రైట్ చెప్పడం ఎంతవరకు సమంజసమనే చర్చ పార్టీలో జరుగుతున్నదని బీజేపీ నేతలే అంటున్నారు. పార్టీని, శ్రేణులను నడిపించడం అటుంచి.. కనీసం సొంత సీటు కూడా గెలిపించుకోలేని స్థితిలోఉన్న నేతను పార్టీలోకి తీసుకుంటే లాభమా.. నష్టమా అనేది ఆలోచించుకోవాలని సూచిస్తున్నట్టు సమాచారం.
కబ్జాదారులకు అండగా నిలిచినట్టు కాదా!
బీసీ వర్గానికి ప్రతినిధినని చెప్పుకొనే ఈటల ఏకంగా వారి భూములనే కబ్జాచేయడాన్ని బీజేపీ శ్రేణులు వేలెత్తి చూపుతున్నారు. కబ్జా చేసినట్టు బలమైన సాక్ష్యాలున్న నేపథ్యంలో ఆయనను పార్టీలో చేర్చుకొంటే ప్రజల్లో తాము తలెత్తుకోలేమని వాపోతున్నారు. మంత్రి పదవిలో, అధికారపార్టీలో ఉండగానే చేర్చుకొంటే కనీసం ఒక బలమైన నేతను పార్టీలో చేర్చుకున్నామని చెప్పుకోగలిగే వాళ్లమని.. ఇప్పుడు తీసుకొంటే కబ్జాదారులకు అండగా నిలిచారన్న అపఖ్యాతి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
బండికి బ్రేక్ వేసేందుకే..
నిజానికి ఈటలను బీజేపీలోకి తీసుకురావడం వెనుక కిషన్రెడ్డిదే ప్రధానపాత్రగా చెప్పుకొంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు పగ్గాలు వేయాలనే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఇదంతా అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. గతంలో బీజేపీ మహిళానేత డీకే అరుణ ప్రభావాన్ని తగ్గించేందుకే సినీనటి విజయశాంతిని కిషన్రెడ్డి తీసుకొచ్చినట్టు పార్టీలోనే చెప్పుకొన్నారు.
సీనియర్ల గుర్రు
సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న సీనియర్లకు చెప్పకుండా.. స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒక నేతను పార్టీలోకి ఆహ్వానించడంపై బీజేపీలో అసంతృప్తి వెల్లడవుతున్నది. ఇప్పటికే ఈటల చేరిక వ్యవహారానికి సంబంధించి హుజూరాబాద్లో సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. సీనియర్లకు సమాచారం ఇవ్వకుండా.. ఎవరి ఇంట్లోనో, ఫాంహౌజ్లోనో నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో పార్టీకి నష్టం కలుగుతుందనే అంశాన్ని బహిరంగంగానే వినిపించారు. పార్టీలో మిగతా నేతలు కూడా వర్గాలుగా విడిపోయారు. ఎమ్మెల్యే రఘునందన్రావు ఈ వ్యవహారంపై ఒక్కమాటా మాట్లాడకపోగా.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి తదితరులది మరో కుంపటిగా మారింది. కొత్తగా పార్టీలోకి వస్తున్నవారు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పాతవారు, కుల సమీకరణాల నేపథ్యంలో తెరపైకి వచ్చినవారు.. అనే మూడువర్గాలుగా బీజేపీ నేతలు చీలిపోయారు.