హైదరాబాద్, ఏప్రిల్1, (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకుని ఎగవేసిన ఆరోపణలపై మాదాపూర్ శిల్పకళా వేదిక పక్కన ఉన్న గోల్డెన్ జూబ్లీ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.1,285 కోట్లకుపైగా రుణం ఎగవేసినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కో-ఆపరేటివ్ ఫైనాన్షియల్ సర్వీస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అశుతోష్ బాజ్పాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. హోటల్ ఎండీ, సీఈవో లక్ష్మీ నారాయణ్ శర్మ, డైరెక్టర్లు అర్జున్ సింగ్ ఒబెరాయ్, నేహా గంభీర్, యష్దీప్ శర్మలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 2009 నుంచి 2015 వరకు టర్మ్ లోన్ల పేరిట రూ.678.89 కోట్లు, బ్యాంక్ పూచీకత్తుల కింద మరో రూ.50 కోట్లను బ్యాంకుల నుంచి తీసుకున్నారు. ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడంతోపాటు తిరిగి చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయినట్టు ఫిర్యాదులో బ్యాంకర్లు పేర్కొన్నారు. ఇలా మొత్తం రూ.1285.45 కోట్ల బకాయిని బీవోబీ నేతృత్వంలోని ఏడు బ్యాంకుల కన్సార్షియంకు చెల్లించాల్సి ఉన్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ బ్యాంకుల్లో కార్పొరేషన్, పీఎన్బీ, పంజాబ్ అండ్ సింధ్, సిండికేట్, జమ్ము అండ్ కశ్మీర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి. కాగా, నిందితులపై ఐపీసీ సెక్షన్ 120-బి, రెడ్విత్ 420, పీసీయాక్ట్ 13(2) రెడ్విత్ 13(1),(డి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఒబెరాయ్ నివాసంసహా హైదరాబాద్, ఢిల్లీల్లో సీబీఐ అధికారులు సోదాలు సైతం నిర్వహించారు. ఈఐహెచ్ లిమిటెడ్ ఎండీగా కూడా ఒబెరాయ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.