ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రవాహం
ఫస్టియర్లో భారీగా చేరుతున్న విద్యార్థులు
ఇప్పటికే 95 వేలు దాటిన అడ్మిషన్లు..
17 వరకు ప్రవేశాల గడువు పొడిగింపు
గురుకులాల్లోను ప్రవేశాల జోరు
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): 2,040..1,162..1,153 ఇవేమీ కార్పొరేట్ కాలేజీలు సాధించిన ర్యాంకులు కాదు. ఇవి తెలంగాణలోని సర్కారు కాలేజీల్లో అడ్మిషన్ల వివరాలు. సర్కారు ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాలు పోటెత్తుతున్నాయి. విద్యార్థులంతా సర్కారు కాలేజీలకే జైకొడుతున్నారు. ఇప్పటివరకు 95,128 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రవేశాల గడువు జూలై 31తో ముగియగా, తాజాగా ఆగస్టు 17 వరకు పొడిగించారు. దీంతో ప్రవేశాల సంఖ్య 1.2 లక్షలకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2019-20లో ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో 65 వేలమంది మాత్రమే చేరగా, 2020-21లో 85 వేల మంది ప్రవేశాలు పొందారు. ఈ విద్యాసంవత్సరం ఇప్పటికే అడ్మిషన్లు 95 వేలు దాటాయి. గతేడాదికంటే 10 వేల మంది అదనంగా చేరారు. పలు కాలేజీల్లో సీట్ల కోసం ఎమ్మెల్యే, ఎంపీలు సిఫారసు చేయడం విశేషం.
సకల సౌకర్యాలు
సకల వసతులున్న సొంత భవనాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, సత్వర ఉపాధినిచ్చే వృత్తివిద్యా కోర్సులు, అత్యాధునిక ప్రయోగశాలలు, విశాలమైన క్రీడా ప్రాంగణాలు.. ఇలాంటి సకల సౌకర్యాలున్న విద్యాసంస్థలు ఏవైనా ఉన్నాయంటే అవి ప్రభుత్వ కాలేజీలే. దాంతో విద్యార్థులు ఈ కాలేజీల్లో చేరటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది పదోతరగతిలో 5.1 లక్షల మంది ఉత్తీర్ణలయ్యారు. వీరిలో ఎక్కువమంది ప్రభుత్వ కాలేజీల్లోనే చేరుతున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు కొలిక్కిరాగా, గురుకులాల్లో ప్రవేశాల ప్రక్రియ కొసాగుతున్నది. రాష్ట్రంలో 406 ప్రభుత్వ కాలేజీలు, 153 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 89 గిరిజన గురుకులాలు, 192 మోడల్ స్కూళ్లు, 60 బీసీ గురుకులాలు, 2 రైల్వే, 193 మైనార్టీ, 166 కేజీబీవీలు, 36 తెలంగాణ గురుకులాలున్నాయి. వీటిల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకున్నది. ఈ కాలేజీల్లో మరో 1.5 లక్షల మంది చేరే అవకాశం ఉన్నదని సమాచారం. మొత్తంగా 2.5 లక్షల మంది సర్కారు కాలేజీల్లోనే చేరే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. కొన్నేండ్లుగా ప్రభుత్వ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడుతుండటంతో విద్యార్థులు బాగా ఆకర్షితులవుతున్నారు. గతంలో ఇంటర్ విద్య అంటే ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం చాలా కాలేజీల్లో ఎంఈసీ కోర్సు ప్రవేశపెట్టారు. నైపుణ్యశిక్షణ, వృత్తివిద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ 22 ఒకేషనల్ కోర్సులను ప్రారంభించారు. ఎంపీహెచ్డబ్ల్యూ, సీఎస్ఈ, ఆఫీస్ అసిస్టెంట్షిప్, అకౌంట్స్ అండ్ టాక్సేషన్, హాస్పిటాలిటీ తదితర కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది హోంసైన్స్ కో ర్సును కూడా కొన్ని కాలేజీల్లో ప్రారంభించనున్నారు. ఈ కోర్సులు పూర్తిచేసినవారికి వెంటనే ఉపాధి లభిస్తుండటం తో విద్యార్థులు ఎక్కువగా వాటినే ఎంచుకొంటున్నారు.
అంతా ఉచితం..
ప్రభుత్వ ఇంటర్ కాలేజీలను బలోపేతం చేయడానికి రాష్ట్రప్రభుత్వం ఆరేండ్లలో రూ.657 కోట్లకు పైగా ఖర్చుచేసింది. 2015-16 నుంచి దేశంలోనే మొదటిసారి విద్యార్థుల అడ్మిషన్ ఫీజులను పూర్తిగా రద్దుచేసింది. ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తున్నది. విద్యార్థులకు బ యోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టింది. ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్నది. ఎంసెట్, జేఈఈ మెయిన్, నీట్ లాంటి పరీక్షలకు ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆర్మీ, పోలీసు ఉద్యోగాలకు విద్యార్థులను సన్నద్ధంచేసేందుకు కాలేజీల్లో శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వి ద్యార్థులకు కెరీర్పై అవగాహన కల్పించేందుకు కెరీర్గైడెన్స్ పోర్టల్ ప్రారంభించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నా రు. కాలేజీకి ఒక కౌన్సిలర్ను సైతం నియమించారు.
నమ్మకం పెరుగుతున్నది
ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పూర్వ వైభవాన్ని సంతరించుకొంటున్నాయి. సర్కారు కాలేజీల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతున్నది. ఇప్పుడు ఎక్కువమంది సర్కారు కాలేజీల వైపు చూస్తున్నారు. కరోనాతో విద్యార్థులు నష్టపోకుండా ఆడియో విజువల్ పాఠ్యాంశాలను తయారుచేసి దూరదర్శన్, టీశాట్ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభించాం.
ఆన్లైన్లోనే ప్రవేశాలు
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. మా కాలేజీలో ఇప్పటివరకు 200 మంది ఫస్టియర్లో ప్రవేశాలు పొందారు. విద్యార్థులు కాలేజీకి రానవసరం లేకుండా ఆన్లైన్లోనే అడ్మిషన్లు కల్పిస్తున్నాం. ఈ విధానం సత్పలితాలిస్తున్నది.
ప్రభుత్వ చొరవ ఫలితమే..
రాష్ట్రప్రభుత్వ చర్యల ఫలితంగానే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు బలోపేతమవుతున్నాయి. ఏటా అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట వేసింది. ప్రభుత్వ చొరవతో అధ్యాపకులు అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేకంగా అడ్మిషన్ల డ్రైవ్ చేపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.