గజ్వేల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ పట్టణంలో 15 ఎకరాల్లో సమీకృత క్రీడా గ్రామం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ( SATS ) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు క్రీడా గ్రామం ఏర్పాటు చేసే స్థలాన్ని చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సమీకృత క్రీడా గ్రామాన్ని ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తామన్నారు. బ్యాడ్మింటన్, వాలీ బాల్, జూడో, రెజ్లింగ్, బాక్సింగ్, కబడ్డీలో క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. ఫుట్ బాల్ అకాడమీని కూడా నెలకొల్పుతామన్నారు. ఇందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే క్రీడా గ్రామం ఏర్పాటుకు కావాల్సిన నిధులను విడుదల చేయాలని స్పోర్ట్స్ అకాడమీకి మంత్రి హరీష్ రావు లేఖ రాశారని తెలిపారు.