సిద్ధిపేట : జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సమీకృత మార్కెట్ ఆవరణలో ఆదివారం ఉదయం ఉమ్మడి మెదక్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) సహకారంతో ఏర్పాటైన సమీకృత రైతు సేవా ఎరువుల కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక రైతు తిప్పలు తప్పినట్లు చెప్పారు. లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకే రైతులకు ఎరువులు, పురుగు మందులు రైతన్నల సాగుకు అవసరమైనవన్నీ ఎరువుల విక్రయాలు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.
సాగు దిగుబడి పెంచేందుకు ఉపయుక్తమైన పురుగు మందులు, ఇతర ఉత్పత్తుల వాడకం, ఇలా పలు అంశాలపై ఈ కేంద్రంలో రైతులకు అవగాహన కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు డీసీఎంఎస్ నిర్ణయించిందన్నారు. కాగా మార్కెట్ ధరకే రైతులకు ఎరువులు విక్రయిస్తామన్నారు. రైతులకు దగ్గరగా సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సేవ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రైతులంతా ఈ ఎరువుల కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీఏంఎస్ చైర్మన్ శివకుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరామ్, డీసీఎంఎస్ డైరెక్టర్ కనక రాజు, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందిని శ్రీనివాస్, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.