హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్పై ఆంధ్రజ్యోతి అక్కసు వెళ్లగక్కింది. ‘కమాండ్కు కాసులు కరువు’అంటూ మరో అబద్ధాల ప్రచారానికి తెరలేపింది. క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో షరామామూలుగా వక్రబుద్ధిని ప్రదర్శించింది. దేశంలోనే ప్రప్రథమంగా, తెలంగాణ ప్రతిష్ఠను పెంపొందించేలా అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన నిర్మాణ పనులపై బురదజల్లేందుకు ప్రయత్నించింది. రాష్ట్రంలో ఏమూలన ఏ చిన్న ఘటన జరిగినా నేరుగా హైదరాబాద్ నుంచి ఆదేశాలు జారీ చేసేలా, ఏ విపత్తు వచ్చినా అన్ని ప్రభుత్వ వ్యవస్థలు ఒక్కచోట నుంచి పర్యవేక్షించేలా నిర్మిస్తున్న ఈ సెంటర్పై అడ్డగోలు నిందలకు పూనుకున్నది. భారీ స్థాయి నిర్మాణ పనుల్లోని విస్మరించదగిన కొన్ని చిన్నచిన్న అంశాలను భూతద్దంలో చూపేందుకు ప్రయత్నించింది. ఈ కథనంలో ఆంధ్రజ్యోతి ప్రచురించినవన్నీ అబద్ధాలేని ఆర్ అండ్ బీ శాఖ కౌంటర్ ఇచ్చింది. ఆ పత్రిక ప్రచురించిన ప్రతి అంశంపై వాస్తవాలను వివరిస్తూ ఆశాఖ ఈఎన్సీ ఐ గణపతిరెడ్డి గురువారం రిజాయిండర్ను విడుదలచేశారు.
అబద్ధం1: పనుల్లో జాప్యం కారణంగా ప్రాజెక్టు విలువ రూ.585 కోట్లకు చేరింది.
వాస్తవం: పనుల్లో జాప్యం కారణంగా ప్రాజెక్టు విలువ పెరగలేదు..పనులు పెరగడం, టెక్నికల్గా కొన్ని స్పెసిఫికేషన్లు పెరగడం, బిల్ట్ అప్ ఏరియా అధికమవ్వడం.. ఈ అంశాల కారణంగానే ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది.
అబద్ధం 2: నాణ్యత లేకపోవడంతో అద్దాలు పగులుతున్నాయి.
వాస్తవం: నాణ్యత లోపాల కారణంగానే టవర్స్లో ఏర్పాటుచేసిన అద్దాలు పగులుతున్నాయన్నది వాస్తవం కాదు. పూర్తిస్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించి, పలు రకాల నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే అద్దాలను బిగిస్తున్నాం. నిర్మాణ పనుల్లో భాగంగా 300 టన్నుల సామర్థ్యం ఉన్న క్రేన్లను వాడుతున్నాం. వీటి కారణంగా ఒకటి రెండు చోట్ల అద్దాలు పగిలి ఉండొచ్చు. వాటిని కూడా కాంట్రాక్టరే తన డబ్బుతో తిరిగి బిగిస్తున్నారు. ఇంత పెద్ద నిర్మాణంలో ఇలాంటి పగుళ్లు పెద్దగా పరిగణలోకి తీసుకునే అంశాలే కావు.
అబద్ధం 3: కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నది.
వాస్తవం: కాంట్రాక్టర్కు డబ్బులు విడుదల చేయడంలో ఎలాంటి జాప్యం లేదు. కాంట్రాక్టర్ బిల్లులు సమర్పించిన వెంటనే ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయి.