దేవరకొండ, జూన్ 29: కానుగకు ఆపదొచ్చింది. నిన్నామొన్నటిదాకా నిప్పులు గక్కిన ఎండలోనూ దారిపొడవునా, ఇంటి ముందరా నీడనిచ్చిన కానుగ చెట్లపై తెలియని పురుగులు దాడిచేస్తున్నాయి. రెండు, మూడ్రోజుల్లోనే చెట్టు మీద ఆకు అన్నదే లేకుండా తినిపారేస్తున్నాయి. నల్లగొండ జిల్లా దేవరకొండ చుట్టుపక్కల కొద్దిరోజులుగా ఈ పరిస్థితి ఆందోళనకు గురిచేస్తున్నది. నెల కిందటి వరకూ డైబాక్ డిసీజ్తో వేప చెట్లు ఎక్కడికక్కడ ఎండిపోయిన సంగ తి తెలిసిందే. ఆయుర్వేద గుణాలున్న వేప చెట్లు 90 శాతం వరకు బతకడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు.. ఇప్పుడు కండ్ల ముందే కానుగ చెట్లు మోడు వారిపోతుండటం చూసి ఆందోళన చెందుతున్నారు.
చెట్లు మళ్లీ చిగురిస్తాయి
కానుగ చెట్ల ఆకులను గొంగళి పురుగు తింటున్నది. దీనివల్ల పెద్ద నష్టమేమీ లేదు. చెట్లకు మళ్లీ ఆకులు చిగురిస్తాయి. ఇలాంటి పురుగులు గతంలో ఆముదం పంటపై ఆశించి నష్టపరిచాయి. 50 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్ పిచికారీ చేస్తే గొంగళి పురుగు చనిపోతుంది. పురుగులు ఆశించిన కానుగ చెట్లపై దీన్ని పిచికారీ చేసుకోవచ్చు. పురుగుల వల్ల మానవాళికి ఎలాంటి హాని ఉండదు.
–రవికుమార్, వ్యవసాయాధికారి, దేవరకొండ