సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ పీ వెంకట్రామరెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి. కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రజాభ్యుదయం కోసం శ్రమిస్తామని అందులో రాశారు. దాని పూర్తి పాఠం ఇదీ..తెలంగాణ కళ్లతో చూసి, తెలంగాణ హృదయంతో ఆలోచించి, తెలంగాణ దృక్పథంతో పరిపాలనను పునర్నిర్వచించినమీ దార్శనికత ప్రభుత్వ యంత్రాంగానికి స్ఫూర్తి.
మీ నేతృత్వంలో ఫలించాయి… ఎన్నెన్నో ఆదర్శ ఆవిష్కరణలు, అమోఘ నిర్మాణాలు, అద్భుత విజయాలు.. వీటన్నిటికీ మీరే కర్త.. కర్మ.. క్రియ. అన్నీ మీరై మమ్మల్ని నడిపించారు.
పరిపాలనా పగ్గాలు చేపట్టిన కొద్దికాలంలోనే మీరు సాధించిన అపూర్వ విజయాలెన్నెన్నో.. ఇరవై నాలుగు గంటల నిర్వరామ విద్యుత్తుశక్తి ప్రసారంతో తెలంగాణను తేజోమయం చేశారు.
కాళేశ్వరం జలాలతో సాగులో స్వర్ణయుగాన్ని సృష్టించి, పంట పెట్టుబడి, రైతుబీమాతో రైతుబంధుగా రాణకెక్కారు.అపర భగీరథులై స్వచ్ఛ జలాలతో తరతరాల దాహార్తిని తీర్చారు.హరితహారంతో పర్యావరణాన్ని పరిరక్షించి, తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపి, అద్భుతమైన సంక్షేమ పథకాలతో పరిపాలనలో మానవీయ పరిమళాలను వెదజల్లారు..
మీ ఆలోచనలు సాకారం చేయటంలో అమాత్యవర్యులు శ్రీ తన్నీరు హరీశ్రావు గారి మార్గదర్శనం, వారి అకుంఠిత కార్యదీక్ష, నిత్యసమీక్ష నిరంతర శ్రమ మాకు అనునిత్యం ప్రేరణగా నిలిచాయి.
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, ప్రజలు అందించిన సహకారం అనిర్వచనీయం.మీ ప్రతి ప్రయోగానికి ప్రథమ వేదిక సిద్దిపేట జిల్లా కావటం,దానిని విజయవంతం చేసే బాధ్యతను మేము, మా సహచర అధికార బృందం పంచుకోవటం మా అందరి అదృష్టం.మీరిచ్చిన ఇదే స్ఫూర్తితో, ఈ ఉజ్వల ప్రస్థానంలో, మీ అడుగులో అడుగువేస్తూ ప్రజాభ్యుదయం కోసం శ్రమిస్తాం. మీరు చూపించే వెలుగుదారుల్లో పయనిస్తాం.
వినమ్రతతో…
పీ వెంకట్రామరెడ్డి ఐ.ఏ.ఎస్,
కలెక్టర్, సిద్దిపేట జిల్లా
జిల్లా పరిపాలనా యంత్రాంగం.