సౌతాంప్టన్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. కివీస్ బౌలర్ జేమీసన్ వేసిన 21వ ఓవర్లో రోహిత్(34) క్యాచ్ ఔటయ్యాడు. బ్యాట్కు ఎడ్జ్ అయిన బంతి నేరుగా మూడో స్లిప్లో ఉన్న ఫీల్డర్ టిమ్ సౌథీ చేతిలో పడింది. కుడివైపునకు డైవ్ చేసిన సౌథీ బంతిని తన రెండు చేతులతో అందుకున్నాడు. దీంతో 62 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది.
ఆరంభం నుంచి కివీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న హిట్మ్యాన్..మరో యువ ఓపెనర్ శుభ్మన్ గిల్తో కలిసి శుభారంభం అందించాడు. వీరిద్దరూ రాణించడంతో 18వ ఓవర్లో భారత్ 50 పరుగుల మార్క్ దాటింది. వాగ్నర్ వేసిన 25వ ఓవర్లో గిల్(28) కూడా ఔటయ్యాడు. ఆఫ్స్టంప్కు ఆవల పడిన బంతిని షాట్ ఆడబోయిన గిల్ బ్యాట్కు ఎడ్జ్ కావడంతో వికెట్ కీపర్ వాట్లింగ్ చేతికి చిక్కాడు. 25 ఓవర్లకు భారత్ రెండు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(0), పుజారా(0) క్రీజులో ఉన్నారు.