హైదరాబాద్ : కృష్ణానది జలాల కేటాయింపులు, వివాదాలపై లోక్సభ జీరో అవర్లో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి నోటీస్ ఇచ్చారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి నదీ జలాల వివాదాలను పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో కృష్ణానదీ పరీవాహక ప్రాంతం 69 శాతం ఉంది.. ఏపీలో 31 శాతం ఉంది. కానీ, రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపు చూస్తే తెలంగాణకు అన్యాయం జరిగిందని స్పష్టమవుతున్నది. 69 శాతం పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు కేవలం 299 టీఎంసీల ఎలా కేటాయిస్తారు.? 31 శాతం ఉన్న ఏపీ 512 టీఎంసీల నీటిని ఎలా పొందుతున్నదని నిలదీశారు.
కృష్ణానీటి కేటాయింపుల విషయంలో న్యాయం చేయమని అనేక సార్లు సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. కానీ కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడంలో విఫలమైనందున తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. అనంతరం జల్ శక్తి మంత్రిత్వ శాఖ కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడంతో న్యాయం చేస్తుందని ఆశించి ప్రభుత్వం కేసును ఉపసంహరించుకుందని ఎంపీ గుర్తుచేశారు.
కానీ, ఈ విషయంలో న్యాయం చేయకపోగా.. సమస్యను మరింత జఠిలం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కృష్ణానది నిర్వహణ మండలిని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. కృష్ణానది నీటిని ఏపీ, తెలంగాణ మధ్య 50:50గా కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయాలని లోక్సభలో డిమాండ్ చేశారు.