హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): డబ్బులు లేక ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులుఎవరూ విద్యకు దూరం కావొద్దని, వారిని ఆదుకునేందుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (తెలుగు యూనివర్సిటీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయా ఫీజులను దాతల ద్వారా సమకూర్చాలని నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే స్పాన్సర్షిప్స్ పథకం ద్వారా ఫీజులు చెల్లించాలని భావిస్తున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ యూనివర్సిటీలో పలు కోర్సులను నిర్వహిస్తున్నారు. కొన్ని కోర్సుల ఫీజులు భారీగా ఉన్నాయి. నాలుగేండ్ల బీఎఫ్ఏకు రూ.29,830, రెండేండ్ల ఎంఎఫ్ఏకు రూ.45,700, ఎంఏ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజంకు రూ.12,040, పీజీ డిప్లొమా ఇన్ ఫిలిం డైరెక్షన్కు రూ.37,060 ఫీజులున్నాయి. పలు డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులకు సైతం రూ.3,270 నుంచి రూ.5,200 వరకు ఫీజులు ఉన్నాయి. సెల్ఫ్ఫైనాన్స్ కోర్సుల ఫీజులు రూ.5 వేల నుంచి రూ.37 వేల వరకు నిర్ణయించారు. వీటిలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తిచూపిస్తున్నా.. ఫీజులు ప్రతిబంధకంగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఆయా ఫీజులను చెల్లించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్సహా తెలంగాణలోని దాతలు ఈ స్పాన్సర్షిప్ పథకం ద్వారా విద్యార్థులను ఆదుకునేందుకు ముందుకురావాలని వర్సిటీ అధికారులు విజ్ఞప్తిచేశారు. అందరికీ స్పాన్సర్షిప్ ద్వారా ఫీజులు సమకూర్చలేమని, విద్యార్థుల నేపథ్యం, ప్రతిభ, ఆర్థిక స్థితిగతులను బట్టే ఫీజులు చెల్లిస్తామని తెలిపారు.
స్పాన్సర్షిప్స్ ద్వారా ఫీజులు సమకూర్చాలన్నది నా సొంత ఆలోచన. మారుమూల పల్లెల్లోని ఏ విద్యార్థి డబ్బు సమస్య కారణంగా చదువులకు దూరం కావొద్దన్న సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. గ్రామీణ ప్రాంతాల పిల్లలు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వారిని ఆదుకోవడంలో భాగంగా స్పాన్సర్షిప్స్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే కొందరు ముందుకొచ్చారు. మంచి మనసున్న దాతలు యూనివర్సిటీని సంప్రదించవచ్చు.
ప్రొఫెసర్ తంగెడ కిషన్రావు, వైస్చాన్స్లర్