హైదరాబాద్ జూలై 29 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. ఆల్మట్టి 30 గేట్లను ఎత్తగా 4 లక్షల క్యుసెక్కుల వరద దిగువన నారాయణపుర, జూరాలకు చేరుతున్నది. జూరాల నుంచి 4.50 లక్షల క్యుసెక్కులకుతోడు తుంగభద్ర నుంచి వచ్చే 80 వేల క్యుసెక్కులు కలుపుకుని శ్రీశైలం ప్రాజెక్టుకు 5.30 లక్షల క్యుసెక్కుల వరద వస్తున్నది. దీంతో శ్రీశైలంలో 10 గేట్లను ఎత్తి దిగువన నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 204 టీఎంసీలకు చేరుకున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 8.5 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది.
పర్యాటక శోభ
శ్రీశైలం గేట్లు తెరవడంతో పర్యాటకులు తరలి వస్తున్నారు.ప్రాజెక్టు వ్యూపాయింట్ నుంచి కృష్ణ మ్మను చూసి ఆహ్లాదాన్ని పొందారు. తెలంగాణ, ఏపీ నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు రావడంతో ప్రాజెక్టు పరిసరాల్లో సందడి నెలకొన్నది. ఇబ్బం దులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.