మహబూబాబాద్: గత ప్రభుత్వాలు మహిళలు, పిల్లల సంరక్షణ చర్యలను సరిగ్గా అమలు చేయలేదని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజన మహిళలు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ జిల్లాలో పోషణ్ అభియాన్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్లో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలు ఆచరించేలా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయని కేంద్ర మంత్రులే ప్రశంసిస్తున్నారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఒక్క కళ్యాణ లక్ష్మి పథకంతో బాల్యవిహహాలకు అడ్డుకట్ట వేశారని చెప్పారు. రాష్ట్రంలో మాతా శిశు మరణాల రేటు చాలా తగ్గిందని వెల్లడించారు.
ఏ రాష్ట్రంలో లేనివిధంగా అంగన్వాడీలకు సీఎం కేసీఆర్ జీతాలు పెంచారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. అన్ని వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు.