రాయికోడ్, ఏప్రిల్ 2: పుష్కలంగా వర్షాలు కురవడంతో రైతులు యాసంగి కాలంలో కూడా పంటలు పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. వర్షకాలంలో పండించిన పంటలు పూర్తి అయిన తర్వాత యాసంగి పంటలు పండిస్తున్నారు. మండలంలో యసంగిలో పంటలు సాగులో 39ఎకరాల్లో వరి, 1075ఎకరాల్లో జొన్న, 123 ఎకరాల్లో కుసుమలు, 4211 ఎకరాల్లో శనిగలు, 38 ఎకరాల్లో మినుములు, 250 ఎకరాల్లో నువ్వులు సాగు చేశారు. వర్షాకాలంలో వర్షాలు అధికంగా కురవడంతో ఈ సంవత్సరం బావులు, బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు వాగునీళ్లతో, మరికొందరు మంజీర పరివాహక ప్రాంతాల్లో నది నీళ్లను ఉపయోగించుకొని పంటలను పండించుకుంటున్నారు. రైతులు తమ పొలాల్లో యాసంగి పంటలు వేయడంతో గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకు చేతి నిండా పనులు దొరుకుతున్నాయి.
రెండు పంటలు వేయడంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ప్రభుత్వం రైతుబంధు ఇవ్వడంతో రైతులకు పెట్టుబడ్డి సాయం అందుతుంది. గ్రామాల్లో వ్యవసాయ భూములకు అధికంగా కౌలు వస్తోంది. ఎకరానికి రూ.25వేల నుంచి, 30వేల వరకు పలుకుతుంది. పండించిన పంటకు మంచి ధర పలుకడంతో ఎలాంటి ఇబ్బందులు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉచితంగా 24గంటలు విద్యుత్ సరఫరా ఇవ్వడంతో పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి. దీంతో వారు పంటలు పండించుకుంటున్నారు.