హైదరాబాద్, ఆగస్ట్ 17(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానున్నది. వచ్చే ఏడాది అక్టోబర్లో నిర్వహించే రెండో యునైటెడ్ నేషన్స్- వరల్డ్ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (ఐక్యరాజ్యసమితి- ప్రపంచ భౌగోళిక సమాచారం సదస్సు-యూఎన్ డబ్ల్యూజీఎస్ఐసీ)కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనున్నది. తొలి సదస్సును 2018లో చైనాలో నిర్వహించగా, రెండో సదస్సుకు హైదరాబాద్ను ఎంపికచేయడం విశేషం. సదస్సు ఏర్పాట్లలో భాగంగా మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సదస్సులో పాల్గొనేందుకు జియో స్పేషియల్ రంగంలోని వివిధ దేశాలకు చెందిన ప్రపంచస్థాయి నిపుణులు, భాగస్వాములు, శాస్త్రవేత్తలు పెద్దసంఖ్యలో హైదరాబాద్కు తరలిరానున్నారు. ‘టువార్డ్స్ జియో- ఎనేబ్లింగ్ ద గ్లోబల్ విలేజ్’ నినాదంతో నిర్వహించే ఈ సదస్సులో జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్, టెకాల్నజీ, ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, అంతర్జాతీయ సహకారం తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి, తీర్మానాలు చేయనున్నారు. సదస్సు నిర్వహణ ద్వారా సంబంధిత స్టేక్ హోల్డర్స్ని, వివిధ దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం సాధ్యమవుతున్నది.
హైదరాబాద్లో డిసెంబర్ 7-9 తేదీల్లో జియో స్మార్ట్ ఇండియా -2021 పేరుతో మరో అంతర్జాతీయస్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ‘అడ్వాన్సింగ్ ద రోల్ ఆఫ్ జియో స్పేషియల్ నాలెడ్జ్ ఇన్ ఇండియన్ ఎకానమీ’ నినాదంతో నిర్వహించే సదస్సులో 20 దేశాలకు చెందిన 800 మంది ప్రతినిధులు, 500 పైగా సంస్థలు పాల్గొననున్నాయి.