న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పక్కా ప్రణాళికను ఎంచుకోబోతున్నది. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దీని కోసం బీసీసీఐ ఇప్పటికే జంబో జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్తో ఐపీఎల్ నిరవధిక వాయిదాను దృష్టిలో పెట్టుకున్న బోర్డు తిరిగి ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా పటిష్టమైన బయోబబుల్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఈనెల 25 నుంచి ఎనిమిది రోజుల పాటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ప్లేయర్లందరినీ బయో బబుల్లో ఉంచి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనుంది. ఇది ముగిసిన వెంటనే ప్రత్యేకమైన చార్టెడ్ విమానంలో జట్టు సభ్యులందరూ మూడు నెలల సుదీర్ఘ టూర్ కోసం ఇంగ్లండ్కు బయల్దేరి వెళ్తారని బీసీసీఐ అధికారి ఒకరు శనివారం మీడియాతో అన్నారు. దీంతో పాటు సదరు అధికారి పలు అంశాలపై మాట్లాడారు.
స్వదేశంలో 8, ఇంగ్లండ్లో 10 రోజులు:
డబ్యూటీసీ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ ఒక రోడ్మ్యాప్ను సిద్ధం చేస్తున్నది. ఇందు కోసం క్వారంటైన్ గడువును రెండు భాగాలుగా విభజించి ప్లేయర్లు వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నది. స్వదేశంలో ఎనిమిది రోజుల పాటు ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని బయోబబుల్ వాతావరణంలో ఉంచుతాం. విరివిగా కొవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తాం. ఈ సమయంలో ఎలాంటి నెట్ ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించే ఆలోచన బోర్డుకు లేదు. జూన్ 2న ఇంగ్లండ్ చేరుకున్న తర్వాత అక్కడి నిబంధనలకు అనుగుణంగా 10 రోజుల పాటు జట్టు సభ్యులందరూ క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. అయితే ఈ సమయంలో ట్రైనింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తరుచూ పరీక్షలు నిర్వహిస్తాం.
కుటుంబ సభ్యులతో కలిసి:
మూడు నెలలకు పైగా సాగే ఇంగ్లండ్ పర్యటన కోసం బయల్దేరే క్రికెటర్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చే అవకాశముంది. కివీస్తో డబ్ల్యూటీసీ పోరు ముగిసాక..ఇంగ్లండ్తో తొలి టెస్టు మొదలుకావడానికి మధ్య నెల రోజులకు పైగా సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్లేయర్లు మానసికంగా ధృడంగా ఉండేందుకు కుటుంబ సభ్యుల తోడ్పాటు అవసరమని భావిస్తున్నది.
20 మందితో జంబో జట్టు
డబ్ల్యూటీసీ టోర్నీ, ఇంగ్లండ్తో ఐదు టెస్టులకు 20 మందితో బోర్డు జట్టును ప్రకటించింది. సుదీర్ఘ పర్యటన దృష్ట్యా ఆటగాళ్లను ఎంపిక చేయడం జరిగింది.
ప్లేయర్లకు వ్యాక్సినేషన్ ఏర్పాట్లు
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ప్లేయర్లు, సహాయక సిబ్బంది కోసం కొవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది. భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లు 18 ఏండ్లకు పైగా వయసు ఉన్న వారందరికీ వ్యాక్సిన్ వేసే అవకాశం కల్పించారు. అయితే రెండో విడుత వ్యాక్సిన్పైనే సందిగ్ధత ఉన్నది. దీనిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)తో సంప్రదింపులు జరుపుతున్నాం. బ్రిటన్ ప్రభుత్వం అనుమతిస్తే..అక్కడ వ్యాక్సిన్ ఇస్తాం. లేకపోతే స్వదేశం నుంచే వ్యాక్సిన్ డోసులు తీసుకెళ్లేందుకు బోర్డు ప్రయత్నాలు చేసే అవకాశముంది. రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వస్తుందని బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చారు.