హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. గురువారం ఏకంగా 5,926 మంది డిశ్చార్జి అయినట్టు శుక్రవారం విడుదలచేసిన బులిటెన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 7,646 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా, ఇతర కారణాలతో 53 మంది మరణించారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,441, మేడ్చల్ మల్కాజిగిరిలో 631, రంగారెడ్డిలో 484, సంగారెడ్డిలో 401 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 81.63 శాతంగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 25,664 పడకలు అందుబాటులో ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రభుత్వ దవాఖానల్లో 7,508, ప్రైవేట్లో 18,156 పడకలు అందుబాటులో ఉన్నాయి.
46 లక్షల మందికి టీకా
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతున్నది. గురువారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా టీకాలు తీసుకున్నవారి సంఖ్య 46 లక్షలు దాటింది. ఇందులో మొదటిడోస్ తీసుకున్నవారు 40 లక్షలు కాగా, సుమారు 6 లక్షల మంది రెండో డోస్ వేసుకున్నారు. గురువారం రాష్ట్రంలో 72 వేలమందికి టీకాలు వేశారు. ఇందులో 54,379 మంది మొదటి డోస్, 17,655 మంది రెండో డోస్ తీసుకున్నారు.