దేశంలో పిల్లల్లో పోషకాహార లేమి ప్రధాన సమస్యగా పరిణమిస్తున్నది. ఎదుగుదల(వయసుకు తగిన ఎత్తు, బరువు) ఆధారంగా సరైన పోషకాహారం అందుతుందా? లేదా? అంచనా వేస్తారు. ఇలా చూస్తే 1998-99తో పోలిస్తే వయసు తగినంత ఎత్తులేని పిల్లల సంఖ్య 2015-16 నాటికి 10శాతానికి పైగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో చేసిన 400 సర్వేలను పరిశీలించి చూస్తే పేద దేశాల కంటే భారతదేశ పరిస్థితి దయనీయంగా ఉన్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): తొంభై దేశాల్లో వివిధ సర్వేలను పరిగణనలోకి తీసుకున్న ప్రపంచబ్యాంక్ మన దేశంలో తాజాగా విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్-5) 2018-19రిపోర్టును ప్రామా ణికంగా తీసుకుంది. అంతకుముందు ఎన్ఎఫ్హెచ్ఎస్ రిపోర్ట్ను బట్టి చూస్తే 16 రాష్ర్టాల్లో పిల్లలకు పోషకాహార సరఫరాలో 1శాతం పెరుగుదల నమోదైంది.
బలవర్ధకమైన ఆహారానికే ప్రాధాన్యం
దేశంలో పిల్లలకు సరైన పోషకాహారం అందకపోవడానికి ప్రధాన కారణం మనం పోషకవిలువలు ఉన్న ఆహారం కంటే బలవర్ధకమైన ఆహారం(ఎనర్జీ సఫీషియంట్) తీసుకోడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్నేండ్లుగా చిన్న పిల్లలు, తల్లులకు బలవర్ధక ఆహారంపై పెడుతూ, పోషకాహారాన్ని పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే సమస్య తీవ్రరూపం దాల్చుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో పోషహాకారం అందించేందుకు ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఎంతగానో ఉందని నొక్కి చెప్తున్నారు. ఏడాదిన్నరగా కొవిడ్-19తో ఆహారభద్రత, లభ్యత, సరఫరాపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. మధ్యప్రదేశ్లో లాక్డౌన్ సమయంలో 80శాతం మంది వర్కింగ్ ఉమెన్స్కు కావాల్సినంత ఆహారం లభించలేదు. మరోవైపు దేశంలో ఆహారంపై పెట్టే ఖర్చు సైతం గతంతో పోలిస్తే 3.7 శాతం తగ్గింది.
ఆ రెండు పథకాలను బలోపేతం చేయాలి
పేద పిల్లలకు పోషకాహరం సరఫరా చేయడంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్(ఐసీడీఎస్), మధ్యాహ్న భోజన పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొన్నేండ్లుగా ఈ పథకాలకు ఆశించిన నిధులు కేటాయించడం లేదు. కొన్నిరాష్ర్టాల్లో స్థానిక ప్రభుత్వాలే ఈ పథకాలను అమలుచేస్తున్నా.. మిగిలిన రాష్ర్టాల్లో దయనీయమైన పరిస్థితి ఉంది. కేంద్రప్రభుత్వం ఈ పథకాలను బలోపేతం చేసి, సమర్థవగా అమలు చేస్తే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లల ఆరోగ్యంపై చేసే ఖర్చు తక్కువ
ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో ఆరోగ్యంపై చేసే ఖర్చు, మరీ ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యంపై చేసే ఖర్చు చాలా తక్కువ. దేశ జీడీపీలో 1.2శాతం ఆరోగ్యంపై కేటాయిస్తుంటే చైనా 2.7శాతం, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలు 3.8 శాతం కేటాయిస్తున్నాయి. ప్రపంచ సగటు 6.5శాతంతో పోలిస్తే భారత్ ఆరోగ్యంపై కేటాయించేది చాలా తక్కువ. ఫలితంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో శిశుమరణాల రేటు, పోషకాహరలోపం ఎక్కువగా ఉంది.