అందివస్తున్న ప్రగతి ఫలాలు
వినియోగంలో కంపోస్ట్ షెడ్డు..
అద్దంలా మెరుస్తున్న రోడ్లు..
అడుగడుగునా పారిశుధ్యం..
ఆహ్లాదం పంచుతున్న మొక్కలు..
మంచిర్యాల, జూలై 5(నమస్తే తెలంగాణ) :మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కాన్కూర్ కొత్త శోభను సంతరించుకున్నది. నాడు చెత్తాచెదారంతో కంపుకొట్టిన పల్లె.. నేడు అందంగా ముస్తాబయ్యింది. తడి-పొడి చెత్తను సేకరించడం, డంప్ యార్డుకు తరలింపుతో రోడ్లన్నీ అద్దంలా మెరుస్తున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఫలాలను కూడా ఇస్తున్నాయి. నాడు చిమ్మచీకటితో బయటికి వెళ్లాలంటేనే జనాలు జంకేవారు. ప్రతి స్తంభానికీ అమర్చిన ఎల్ఈడీ వెలుగుల్లో గ్రామస్తులు నేడు రాత్రిపూట కూడా తమ పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రకృతి వనం, వైకుంఠధామం, వాడవాడలా సీసీ రోడ్లు, చెత్త తొలగింపు, హరితహారం వంటి పనులు పూర్తికావడం, పల్లె ప్రగతి సత్ఫలితాలు ఇస్తుండడంతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రెండేళ్లుగా వ్యాధుల తీవ్రత తగ్గింది.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామం గతంలో ముదిగుంట పంచాయతీలో ఉండేది. 2018లో కొత్త జీపీగా ఏర్పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 948 జనాభా ఉంది. 278 నివా స గృహాలు ఉండగా.. 248 కుటుంబాలు జీవిస్తున్నాయి. పల్లె ప్రగతిలో రెండు పాడుబడ్డ బావులను కూల్చివేశారు. ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంతలు నిర్మించుకున్నారు. ఎనిమిది కమ్యూనిటీ ఇంకుడు గుంతలు కూడా ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీల కోసం కృషి చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో మొ రం, రూ.26 లక్షలతో సీసీ రోడ్లు వేశారు. రూ.2.25 లక్షలతో కం పోస్ట్ షెడ్డును నిర్మించారు. ప్రస్తుతం దాని నుంచి ఎరువు సేకరిస్తున్నారు. రూ.10 లక్షలతో వైకుంఠ ధామాన్ని నిర్మించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతినెలా 1,11,22 తేదీల్లో ఫాగింగ్ చేస్తుంటా రు. మురుగు కాలువల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. ఫలితంగా రెండేళ్లుగా ఒక్కరు కూడా రోగాల బారిన పడలేదు. అనారోగ్యానికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
వంద శాతం పన్ను వసూలు..
ప్రతి నెలా ఇంటి పన్నులు వంద శాతం వసూలవుతున్నాయి. నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన ఏడాదికి రూ.13 లక్షలు వస్తున్నాయి. పంచాయతీకి ఇద్దరు పారిశుధ్య కార్మికులుండగా, ఏడాదికి రూ.2.04లక్షల జీతాలు చెల్లిస్తున్నారు. చెత్త సేకరణకు 278 బుట్టలు పంపిణీ చేశారు. సర్కారు జీపీకి ఇచ్చిన ట్రాక్టర్లు, ఇతరాలకు ఏడాదికి రూ.6.84 లక్షలు వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారు. మురుగు కాలువల నుంచి తీసిన మట్టితోపాటు చెత్తను ట్రాక్టర్, ట్రాలీతో డంప్ యార్డుకు తరలిస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో సీసీ కెమెరాలు కూడా అమర్చారు. పల్లె ప్రగతిలో కరెంటు తీగలు సరి చేశారు. విరిగిపోయిన, వంగిన విద్యుత్ స్తంభాలను తొలగించారు. వాటి స్థానంలో 22 కొత్తవి బిగించారు. వీధి దీపాల కోసం థర్డ్ లైన్ వేశారు. ప్రతి స్తంభానికీ ఎల్ఈడీ లైట్లు అమర్చారు. దీంతో విద్యుత్ కాంతులతో రాత్రిపూట రోడ్లన్నీ జిగేల్మని మెరుస్తున్నాయి.
‘ప్రగతి’తో మారిన ఊరు..
పల్లె ప్రగతితో కాన్కూర్ రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వ స్థలాలు, ఇండ్ల ఆవరణలో నాటిన మొక్కలతోపాటు రోడ్లకు ఇరువైపులా ప్లాంటేషన్తో పచ్చదనం పరుచుకున్నది. ఇంటింటా చెత్త సేకరణతో పారిశుధ్య సమస్య తీరింది. పంచాయతీకి వచ్చే నిధుల్లో పది శాతం గ్రీనరీకి కేటాయిస్తున్నారు. గ్రామం లో రోడ్డు కిరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. ట్రాక్టర్ ట్రాలీతో రోజూ నీరు పోస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో 4 వేల మొక్కలు నాటగా, వంద శాతం బతికాయి. బోర్డు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలను పెంచుతున్నారు. వివిధ మొక్కలతో అందంగా తీర్చిదిద్దిన ప్రకృతి వనం పచ్చదనం పరుచుకొని గ్రామస్తులకు ఆహ్లాదాన్నిస్తున్నది. అటువైపుగా వెళ్లేవారికి కనువిందుచేస్తున్నది.
ప్రభుత్వం, ప్రజల సహకారంతోనే..
రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారంతోనే మారు మూల గ్రామమైన కాన్కూర్ లాంటి పల్లెకూడా అభివృద్ధి చెందుతున్నది. ప్రతి పల్లెకూ సర్కారు నిధులు ఇస్తున్నది. పారిశు ధ్యం మెరుగు కోసం ట్రాక్టర్, ట్రాలీ సమకూ ర్చింది. ప్రజల సహకారం, ప్రభుత్వ ప్రోత్సా హంతోనే గ్రామాన్ని అందంగా తీర్చిది ద్దాం. ఇందులో సర్పంచ్తోపాటు ప్రజాప్రతి నిధులు, పారిశుధ్య కార్మికులు, గ్రామస్తుల సహకారం ఉంది.
సంతోషంగా ఉంది..
పల్లె ప్రగతితో ఊరు అందంగా మారింది. పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ సూచనల మేరకు అభివృద్ధిలో ముందుకు పోతున్నం. ప్రజలు చాలా సహకరిస్తున్నారు. డంప్యార్డు, వైకుంఠధామం, నాణ్యమైన విద్యుత్, స్వచ్ఛమైన తాగు నీటి సరఫరా, పారిశుధ్యం, హరితహారం, సీసీ రోడ్లు.. ఇలా అన్ని విధాలా గ్రామం అభివృద్ధి చెందుతుండడం సంతోషంగా ఉంది.