హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచడం పట్ల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనాన్ని 30 శాతం మేర పెరిగాయి.
ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.13వేలకు చేరింది. ప్రస్తుతం వారి వేతనం రూ.10వేలుగా ఉన్నది. ఎంపీటీసీలు, సర్పంచుల వేతనం రూ.6,500కు పెరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పెంచిన వేతనాలు జూన్ నుంచి అమల్లోకి వస్తాయన్నారు. స్థానిక సంస్థలకు కరోనా ప్రభావం ఉన్నా నిధుల్లో కోత విధించకుండా ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, పల్లె ప్రగతి కార్యక్రమాల్ని అమలు చేయడంలో స్థానిక ప్రజాప్రతినిధులు మరింత క్రీయాశీలకంగా పని చేయాలన్నారు.