పెగడపల్లి, అక్టోబర్ 26: కాళేశ్వరం లింక్-2లో భాగంగా కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం పెంచినట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో కాళేశ్వరం పైప్లైన్ నిర్మాణానికి ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నదన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం మార్కెట్ విలువ ఎకరాకు రూ.2 లక్షలుగా నిర్ధారించింది. రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఎకరా భూమి మార్కెట్ విలువను రూ.3 లక్షలకు పెంచేందుకు అంగీకరించినట్టు చెప్పారు. నిబంధనల ప్రకారం మార్కెట్ విలువకు మూడు రెట్లు పెంచి దీనికి వడ్డీతో కలిపి పరిహారం అందిస్తారని మంత్రి పేర్కొన్నారు. ఈ లెక్కన ఒక్కో ఎకరాకు రూ.9.50 లక్షల వరకు పరిహారం వస్తుందని తెలిపారు.