రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా టాప్
చెప్పినట్టే కొనుగోలు చేస్తున్న సర్కారు
చెల్లింపులు, తడిసిన ధాన్యంపైనా ప్రత్యేక దృష్టి
రైతుల ఖాతాల్లోకి రూ.366 కోట్లు జమ
నిరంతరం అధికారుల పర్యవేక్షణ
నల్లగొండ ప్రతినిధి,మే14(నమస్తే తెలంగాణ): మూడు రోజులుగా అమలవుతున్న లాక్డౌన్ సమయంలోనూ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. గతేడాది యాసంగిలో నల్లగొండ జిల్లాలో టార్గెట్ను మించి 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేసిన అధికారులు. మొత్తంగా 6,46,680 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ యాసంగిలోనూ అదే రీతిలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. యాసంగిలో సాధారణంగా ఉండే ఐకేపీ కేంద్రాలకు తోడు ఈ సారి పీఏసీఎస్, మార్కెట్ యార్డుల ద్వారా రైతుల అవసరాలకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి జగదీశ్రెడ్డి నిరంతరం సమీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులు, రైతులను అప్రమత్తం చేశా రు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ.. రైతులతో సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నారు. మధ్యమధ్యలో వచ్చిన అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నారు.
పోటా పోటీగా..
నల్లగొండ జిల్లాలో వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ కొనుగోళ్లల్లో ఆటంకాలను అధిగమిస్తున్నారు. ధాన్యంలో తాలు తదితర సమస్యలు వస్తే రైతు ప్రతినిధులతో పాటు రైస్మిల్లర్ల ప్రతినిధులతో పలుమార్లు సమావేశమై చర్యలు చేపట్టారు. ఎస్పీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు శాఖ సహకారంతో సాంకేతికంగా వస్తున్న ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ యాసంగిలో శుక్రవారం నాటికి 4, 92, 051 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఏడున్నర లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కొనుగోళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు మొత్తం 65,688 మంది రైతుల నుంచి 4.92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఐకేపీ కేంద్రాల ద్వారా 29,766 మంది రైతుల నుంచి 2,34,248 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా 32,317 మంది రైతుల నుంచి 2,28,603 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇక 13 వ్యవసాయ మార్కెట్ల ద్వారా 3,605 మంది రైతుల నుంచి 29,200 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి.
ఎప్పటికప్పుడు లారీల్లో తరలింపు
కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల్లో మిల్లులకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు 4.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు చేరవేశారు. వీటిల్లో ఐకేపీ కేంద్రాల ద్వారా రూ.442 కోట్లు, పీఏసీఎస్ల ద్వారా 431.60 కోట్లు, మార్కెట్ యార్డుల ద్వారా 55.13 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు చేశారు. ట్యాబ్ ఎంట్రీ అయిన వాటి ల్లో 90 శాతం పైగా చెల్లింపులు పూర్తి చేశారు. ఇప్పటివరకు ఐకేపీ కేంద్రాల ద్వారా రూ. 160 కోట్లు, పీఏసీఎస్ల ద్వారా రూ.189 కోట్లు, మార్కెట్ల ద్వారా రూ.17 కోట్ల నగదు కలిపి మొత్తం 366 కోట్ల నగదును రైతులకు చెల్లింపులు చేస్తూ వారి ఖాతాల్లో జమ చేశారు. మరో 470 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి కొనుగోలు కేంద్రాల్లో ట్యాబ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులను కూడా ఎక్కడా ఆపకుండా ఎప్పటికప్పుడు క్లి యర్ చేస్తూ వస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలోనూ ధాన్యం కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మొత్తం 339 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. 209 ఐకేపీ, 130 పీఏసీఎస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తం 3,74,697 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ఐకేపీల ద్వారా 2,05,968 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ల ద్వారా 1,68,728 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. శుక్రవారం నాటికి జిల్లాలో మొత్తం 47,254మంది రైతుల నుంచి రూ.707.36 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 94 శాతం అంటే 3.53లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశించిన రైస్మిల్లులకు తరలించారు. ఇక కొనుగోలు చేసిన ధాన్యంలో 27,950 మంది రైతులకు రూ.431 కోట్లు రైతులకు చెల్లింపులు చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఐకేపీల ద్వారా 192 కోట్లు, పీఏసీఎస్ల ద్వారా 239 కోట్ల చెల్లింపులను పూర్తి చేశారు. ఇప్పటివరకు 36,369 మంది రైతులకు సంబంధించి 2.84మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తి చేశారు. జిల్లాలో ఇంకా మార్కెట్లకు వచ్చి ఉన్న ధాన్యాన్ని అంతా కొనుగోలు చేసేందుకు అధికారులు తగిన ప్రణాళికతో ఉన్నారు.