పతకం గెలిచిన తొలి తెలంగాణ అమ్మాయిగా రికార్డు.. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్
పటియాల: తెలంగాణ యువ స్ప్రింటర్ అగసర నందిని అరుదైన రికార్డు నెలకొల్పింది. ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజత పతకంతో మెరిసింది. ఈ టోర్నీలో పతకం గెలిచిన తొలి తెలంగాణ మహిళా అథ్లెట్గా నందిని కొత్త రికార్డు లిఖించింది. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల 100 మీటర్ల హార్డిల్స్ ఫైనల్లో 13.88 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన నందిని రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి అయిన నందిని వెండి పతకాన్ని కైవసం చేసుకోగా.. కాస్త ముందుగా లక్ష్యాన్ని దాటిన కనిమొళి (13.63)కి స్వర్ణం దక్కింది. మహిళల లాంగ్జంప్లో నందినికి (6.02 మీటర్లు) తృటిలో పతకం చేజారింది. మరోవైపు మహిళల 3000 మీటర్ల స్టిపుల్ చేజ్లో తెలంగాణ అథ్లెట్ జి.మహేశ్వరి (11:08.19) నాలుగో స్థానంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన అవినాశ్ సేబల్ పురుషుల 3వేల మీటర్ల స్టిపుల్ చేజ్లో 8 నిమిషాల 20.20 సెకన్లతో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు.