హైదరాబాద్ : కల్తీ విత్తనాల నియంత్రణకు దేశంలో మెట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో క్యూ ఆర్ కోడ్ తో సీడ్ ట్రేసబిలిటీని అమలు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. వ్యవసాయరంగంపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆమోదించిన విత్తన కంపెనీలే విత్తన విక్రయాలు చేపట్టేలా చర్యలుండాలన్నారు. క్యూఆర్ కోడ్ తో కూడిన ప్రభుత్వ సర్టిఫైడ్ ముద్రిత విత్తనాల ప్యాకెట్ల మీద ఉంటున్నందున, స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేయడం ద్వారా విత్తన కంపెనీల పూర్తి వివరాలుంటాయని మంత్రి సీఎంకు వివరించారు. ఆలస్యం చేయకుండా తక్షణమే ఈ విధానాన్ని అమలులోకి తేవాలని సీఎం ఆదేశించారు.
ఇప్పటికే రోహిణీ కార్తె ప్రవేశించినందున మరో వారం రోజుల్లో రుతుపవనాలు కూడా వస్తున్నందున, రైతులు వ్యవసాయానికి సిద్దమైతున్ననేపథ్యంలో కావాల్సిన విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచాలని సీఎం తెలిపారు. పత్తి, కంది, వరిధాన్యం విత్తనాలను కావాల్సినంత మేరకు సేకరించి రైతులకు అందించాలన్నారు. అదే సమయంలో కావాల్సినంత ఎరువులను, ఫెస్టిసైడ్లను సిద్ధం చేసుకోవాలన్నారు.