నిర్మల్ : నిర్మల్ పట్టణంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా ఇబ్రహీం చెరువు పూర్తిగా నిండిపోయింది. అయితే చెరువు ప్రాంతంలో అక్రమ లే అవుట్ల వల్ల చెరువు నుంచి బయటకు పోలేని పరిస్థితి నెలకొంది.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఇబ్రహీం చెరువును పరిశీలించారు.
చెరువు ప్రాంతం కబ్జాకు గురి కావడంతో అలుగు పూర్తిగా ముసుకుపోయింది. దీన్ని పరిశీలించిన మంత్రి..నీటిని బయటకు తరలించేలా పునరుద్ధరణ పనులు చేపట్టాలని, అక్రమ లే అవుట్లను వెంటనే తొలగించాలని కలెక్టర్ ను ఆదేశించారు.
అనుమతి లేకుండా లే అవుట్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొని ప్రజలు ఇబ్బందులు పడవద్దని సూచించారు. దివ్యానగర్ లో నీట మునిగి న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను కూడా మంత్రి పరిశీలించారు.
నీటిని బయటకు పంపే పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మున్సి పల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి,అధికారులు, తదితరులు ఉన్నారు.