సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలం నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది కురిసిన కుండపోత వర్షాలతో గ్రేటర్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగానే ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు.
బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గ కార్పొరేటర్లతో సమావేశమైన మేయర్..గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. నాలాల అభివృద్ధి, వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. రూ.858 కోట్లతో చేపడుతున్న నాలా అభివృద్ధి, శిథిల భవనాల కూల్చివేతలపై కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీలకతీతంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ గతేడాది నీట మునిగిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను త్వరితగతిన చేపట్టాలని, ఇదే సమయంలో ఈ వర్షాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలు, మురుగునీటి కాల్వలు కలుపుకొని మొత్తం 884 కిలోమీటర్లు ఉంది. నాలాల మరమ్మతు, పూడిక తొలగింపు పనులను ఆరుగురు ఎస్ఈలతోపాటు ఆయా సర్కిళ్ల జోనల్ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లతో సమన్వయం చేస్తూ మేయర్ పలు సూచనలు జారీ చేస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు!