హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ప్రఖ్యాత లాఫార్జ్ హోల్సిమ్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎల్హెచ్ఐసీ)తో ఒప్పందం కుదుర్చుకున్నది. భవన నిర్మాణరంగంలో అంతర్జాతీయంగా పేరొందిన అంబుజా సిమెంట్, ఏసీసీ కంపెనీలు సంయుక్తంగా హెల్హెచ్ఐసీని నిర్వహిస్తున్నాయి. స్మార్ట్ బిల్డింగ్ సొల్యూషన్స్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి, సుస్థిర, పర్యావరణహిత నిర్మాణాలకు అనుగుణమైన సాంకేతికతను అభివృద్ధిచేసే పరిశోధనకు నిధులను కేటాయిస్తున్నాయి. ఇప్పటికే ఐఐటీ మద్రాస్తోపాటు పలు ప్రఖ్యాత ఐఐటీలతో అది ఒప్పందం కుదుర్చుకొన్నది. తాజాగా ఐఐటీ హెచ్ తో ఎల్హెచ్ఐసీ ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. కాంక్రీట్ నాణ్యతను తక్కువ సమయంలో, పూర్తి కచ్చితత్వంతో తెలుసుకొనేందుకు, ఆన్సైట్ సామర్థ్యాన్ని నిరంతరం అంచనా వేసేందుకు అనువైన స్మార్ట్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఇవి రెండు సంయుక్తంగా పరిశోధనలను కొనసాగించనున్నాయి. ఈ ఒప్పందంపై ఎల్హెచ్ఐసీ ఎండీ, అంబుజా సిమెంట్ భారత సీఈ వో నీరజ్ అకౌరి, ఐఐటీ హెచ్ ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా స్వల్పకాలంలో, నాణ్యమైన గృహాలను నిర్మించడం అవసరమని, అందులో సాంకేతిక పరిజ్ఞానమే కీలకపాత్రను పోషిస్తుందని తెలిపారు.