హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కరోనా థర్డ్వేవ్ తరుముకొస్తున్నదని హెచ్చరికలు వినిపిస్తున్నవేళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ (ఐఐటీహెచ్) చల్లని కబురు చెప్పింది. కొవిడ్-19 నిర్ధారణ పరీక్షల కోసం దవాఖానల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఇంట్లోనే సొంతంగా అతి తక్కువ ఖర్చుతో టెస్టు చేసుకొనే పరికరాన్ని తయారుచేసినట్టు ప్రకటించింది. ఇది కేవలం 30 నిమిషాల్లోనే ఫలితాన్ని వెల్లడిస్తుంది. అందునా ఆర్టీపీసీఆర్ పరీక్ష అంతటి కచ్చితత్వంతో ఫలితం తెలుస్తుందని ఈ పరికరాన్ని ఆవిష్కరించిన పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ శివ్గోవింద్సింగ్ గురువారం తెలిపారు. ‘కొవి హోమ్’ అని పేరుపెట్టిన ఈ కిట్ ఉపయోగించి కేవలం రూ.300 ఖర్చుతో కొవిడ్ టెస్టు చేసుకోవచ్చు.
కొవి హోమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ ఫోన్ ఆధారిత కిట్. ఒలిగో బేస్డ్ టెస్టింగ్ అంటే ఆర్ఎన్ఏ (రైబో న్యూక్లిక్ యాసిడ్)ను విశ్లేషించడం ద్వారా వ్యక్తికి కొవిడ్ 19 వైరస్ సోకిందా? లేదా? దాని లోడ్ ఎంత ఉన్నది అనే విషయాలను ఇది విశదీకరిస్తుంది. దీని పనితీరును ఇటీవల సీఎస్ఐఆర్, సీసీఎంబీ సంయుక్తంగా ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో పరీక్షించాయి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలతో సమానంగా ఇది 98.2 శాతం కచ్చితత్వంతో ఫలితం ఇచ్చినట్టు ప్రొఫెసర్ శివ్గోవింద్ సింగ్ వెల్లడించారు.