న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయపై అఖిల భారత సేవల (క్రమశిక్షణ, అపీల్) నిబంధనల ప్రకారం కఠిన జరిమానా చర్యలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర సిబ్బంది, శిక్షణా మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆయనకు తెలియజేసింది. వ్యక్తిగతంగా లేక లిఖిత పూర్వకంగా తన వాదనను 30 రోజుల్లో తెలియజేయాలని పేర్కొంది. ఒకవేళ ఎలాంటి సమాధానం రాకపోతే ఆయనకు వ్యతిరేకంగా విచారణ జరిపే అధికారం విచారణ అధికారులకు ఉంటుందని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలపన్ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలిపించగా ఆయన స్పందించలేదు. సీఎస్ పదవికి రాజీనామా చేసిన ఆయన సీఎం మమత వ్యక్తిగత వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన బదిలీపై బెంగాల్, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం రాజుకున్నది.