న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో వాటిల్లిన మరణాలపై విచారణ చేపట్టి బాధిత కుటుంబాలకు పరిహారం అందించేందుకు ఆప్ సర్కార్ నియమించిన కమిటీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో కేంద్రం తలదూర్చడం తగదని ఆయన మండిపడ్డారు.
కమిటీల ఏర్పాటుకు మోకాలడ్డవద్దని కేంద్రాన్ని కోరారు. ఆక్సిజన్ అందక మరణించిన కరోనా రోగుల కుటుంబాలకు రూ 5 లక్షల పరిహారం అందించాలని నిపుణుల కమిటీ చేసిన ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ కు సమర్పించిందని ఆయన పేర్కొన్నారు.
ఇక థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే వెల్లడించారు. చిన్నారులపై థర్డ్ వేవ్ ప్రభావం చూపుతుందనే అంచనాతో వైద్యనిపుణులతో కూడిన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. 5000 మంది యువకులకు హెల్త్ వాలంటీర్లుగా శిక్షణ ఇస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.