లక్నో : వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ)లో ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్లోని బిర్లా, లాల్బహుదూర్ శాస్త్రి (ఎల్బీఎస్) హాస్టల్స్ విద్యార్ధులు హోలీ వేడుకల్లో వివాదం నేపథ్యంలో పరస్పరం దాడులకు తెగబడ్డారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘర్షణలు చెలరేగడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు క్యాంపస్కు చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చాయి.
బిర్లా, ఎల్బీఎస్ హాస్టల్స్కు చెందిన విద్యార్ధులు హోలీ వేడుకల్లో రంగులు చల్లుకుంటున్న క్రమంలో చెలరేగిన వివాదం ఘర్షణలకు దారితీసిందని బీహెచ్యూ చీఫ్ ప్రొక్టార్ ప్రొఫెసర్ ఆనంద్ చౌధురి తెలిపారు. పరిస్థితి దిగజారడంతో బిర్లా హాస్టల్కు చెందిన కొందరు విద్యార్ధులు హాస్టల్ టెర్రేస్పై గుమికూడి అక్కడ నుంచి రాళ్లు విసిరారు. వర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్ధులను వారి హాస్టల్స్ లోపలికి పంపించారు. ప్రస్తుతం బీహెచ్యూలో పరిస్ధితి ఉద్రిక్తంగా ఉన్నా అదుపులో ఉందని పోలీసులు, వర్సిటీ అధికారులు వెల్లడించారు.