సిద్దిపేట అర్బన్, మే 2 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో ప్రత్యేకమైన సంగీతపు రాళ్లను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్ తెలిపారు. ఇటీవల గ్రామంలోని గజగిరిగుట్ట పరిసరాల్లో వాటిని గుర్తించామని వెల్లడించారు. బండరాళ్లు, రాతి బిల్లలు మోగుతున్నాయని.. వీటిని రింగింగ్ లేదా సింగింగ్ లేదా సంగీతపు రాళ్లుగా పిలుస్తారని చెప్పారు. ఈ ప్రాంతంలో శాతవాహన కాలం నాటి వస్తు ఆధారాలు లభిస్తున్నాయని, ఇక్కడ స్లిప్డ్ రెడ్ పెయింట్తో ఉన్న రకరకాల డిజెన్ల కుండపెంకులు, టెర్రకోట పూసలు, టెర్రకోట బొమ్మలు దొరికాయని వివరించారు. ఈ ప్రదేశంలో వందల సంఖ్యలో రాకాసిగుళ్లు( పెద్దరాతియుగం సమాధులు) ఉండేవని, ఇప్పుడు అవి పదుల సంఖ్యకు చేరాయని చెప్పారు. ఇందులో రాతిగొడ్డండ్లు, మట్టిపూసలు, కుండపెంకులు లభించాయని బృందం సభ్యులు తెలిపారు. రాతి పనిముట్లలో కొన్ని మోగే రాళ్లు ఉన్నాయని, అందులో ఒక రాయిని వాయిస్తే అది సంగీత స్వరాలను వినిపిస్తుందని తెలిపారు. కొరియా దేశంలో మోగేరాళ్లను ఒక క్రమంలో పేర్చి మ్యూజికల్ జైలోఫోన్గా చేసి ప్రదర్శనకు పెట్టారన్నారు. ఇక్కడ పరిశోధిస్తే మరికొన్ని దొరికే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.