నిజామాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయం కాలక్రమేణా ఆనవాళ్లను కోల్పోయింది. అక్కడ ఓ గుడి ఉన్నట్టు నేటితరానికే తెలియకుండా పోయింది. కానీ, ఓ పూజారి ఏండ్లపాటు జాగ్రత్తగా దాచిన పత్రాలతో మహారాష్ట్రలో తెలంగాణ గుడి భూములు ఉన్నట్టు బయటపడింది. పరాధీనంలో ఉన్న 74.14 ఎకరాల భూమిని చేజిక్కించుకొనేందుకు దేవాదాయశాఖ సన్నద్ధమవుతున్నది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మం డలంలో నీలా గ్రామంలో ఓ రామాలయం ఉండేది. మూడు దశాబ్దాల కిందటి వరకు కూడా గుడికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చేవారు. 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ ఆలయానికి భక్తులు భూదానాలు చేశారు. నిజాం హయాంలో నాందెడ్ ప్రాంతమంతా హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం నుంచి గుడి భూములు మహారాష్ట్రలోనే కొనసాగుతున్నాయి. గుడిలో ఏండ్లపాటు పూజలు చేసిన పూజారి సాంబశాస్త్రి వృద్ధాప్యం కారణంగా సొంతూరు కామారెడ్డికి వెళ్లిపోయారు. అప్పుడే రామాలయానికి సం బంధించి తాను ఏండ్లుగా జాగ్రత్తగా దాచిన పలు కీలక పత్రాలను స్థానికుడు అకం కిషన్కు అందించారు. వీటి ఆధారంగా స్థానికులు కూపీ లాగితే మహారాష్ట్రలో భూముల వ్యవహారం బయటపడింది. నాందెడ్ జిల్లా ధర్మాబాద్ తాలుకాలోని బాలాపూర్ శివారులో ఉన్న 103, 104, 105 /1, 105/2, 96, 97 సర్వేనంబర్లలో 74.14 ఎకరాల భూము లు ఉన్నట్టు తేలింది. గతనెల 27న దేవాదాయశాఖ అధికారులు నీలా వాసులతో కలిసి మహారాష్ట్రకు వెళ్లి భూములను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ బోర్డు కూడా పాతారు. కానీ, ఈ భూమిలో సోయా పండిస్తున్న కొందరు స్థానికులు బోర్డులను తొలగించారు. దీంతో చట్టప్రకారం ముందుకెళ్లేందుకు తెలంగాణ రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఆక్రమణదారులపై నాందెడ్ కలెక్టర్, ధర్మాబాద్ తాసిల్దార్కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఆలయ భూముల హద్దులు తేల్చేందుకు సర్వే కోసం రూ.లక్ష చలానా చెల్లించారు. హద్దులు గుర్తించిన అనంతరం నీలా ఆలయ భూములను తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తామని అక్కడి అధికారులు హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. నీలా రామాలయం గుడికి ఎక్కడెక్కడినుంచో భక్తులు వచ్చి పూజలు చేసేవారని నీలా గ్రామస్తుడు బోడి గంగన్న తెలిపారు. రాముడి భూములు ఉన్నాయని విన్నామేగానీ ఇప్పటిదాకా చూడలేదని స్థానికుడు అకం గంగారాం చెప్పారు. తాను నీలా సర్పంచ్గా ఉన్నప్పుడే ఆ భూములు తిరిగి దక్కడం ఆనందంగా ఉన్నదని గౌరాజీ లలిత పేర్కొన్నారు.