హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాల మండల సమాఖ్యలను ఆదర్శంగా తీర్చిదిద్దేందకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రణాళిక రూపొందించింది. తెలంగాణ మహిళా స్వయం సహాయక సంఘాలు అనేక అంశాల్లో దేశంలోనే ముందున్నాయి. ఈ నేపథ్యంలో మండల సమాఖ్యలు కూడా ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్రంలోని 553 మండల సమాఖ్యల్లో 102 సమాఖ్యలను మొదటి దశలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. వీటి ఎంపిక కూడా పూర్తయ్యింది. మండల సమాఖ్యల ఎంపికలో కొత్త విధానాన్ని అనుసరించారు. బాగా పనిచేసే సమాఖ్యలు, మధ్యస్తంగా పనిచేసేవి, పనితీరు బాగా లేని వాటిని ఇందులో ఎంపిక చేశారు. ఈ సమాఖ్యల్లోని ప్రతినిధులకు, ఈసీ సభ్యులకు అవగాహన కల్పించారు. సెప్టెంబర్ 30లోగా ఆయా మండల సమాఖ్యలు విజన్ బిల్డింగ్ను రూపొందించాలని ఆదేశించారు. వార్షిక ప్రణాళికను రూపొందించడం, ఆర్థిక, ఆర్థికేతర కార్యకలాపాలను, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, గ్రేడింగ్పై ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. వీటన్నింటినీ రాబోయే మూడేండ్లకు అవసరమైన రీతిలో అమలు చేయనున్నారు. మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడమే కాకుండా వారి భవిష్యత్ అవసరాలు, ప్రణాళికలు రూపొందించుకోవడంపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా ఆదర్శంగా తీర్చిదిద్ది ఇతర మండలాలకు స్ఫూర్తి మంతంగా ఉండేలా చేస్తున్నారు. మండల సమాఖ్యల మధ్య ఆరోగ్యకరమైన పోటీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.