నమస్తే తెలంగాణ నెట్వర్క్: సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకాన్ని దళిత సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఈ పథకం దేశానికే ఆదర్శమని సంబురాలు చేసుకుంటున్నాయి. మంగళవారం నల్లగొండ జిల్లా దేవరకొండలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కన్న కలలను నిజం చేస్తూ కేసీఆర్ దళితవర్గాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు కృషిచేస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని 9వ వార్డు, గంగాధర మండలం మల్లాపూర్, కోరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట కాలనీలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. దళితబంధు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ అభినవ అంబేడ్కర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొనియాడారు. ఖమ్మం జిల్లా తల్లాడలో భారీ వర్షంలోనూ డప్పులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. దళితులు ఆర్థికంగా బలోపేతమై స్వశక్తితో అన్నిరంగాల్లో నిలదొక్కుకునేలా సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. జనగామ జిల్లా కేంద్రం శివారులోని ఎస్ఆర్ గార్డెన్లో దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.