ఆయుర్వేద మందుపై ఉప రాష్ట్రపతి ఆరా కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా మందుపై ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆరా తీశారు. శుక్రవారం ఆయన ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్తోనూ, ఆయూష్ ఇంచార్జి మంత్రితోనూ మాట్లాడారు. ఈ మందుపై అధ్యయనం చేయాలని సూచించారు.
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న కరోనా మందు పనిచేసే విధానం, దాని శాస్త్రీయతపై అధ్యయనం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మందు కోసం ప్రజలు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ మందును పంపిణీ చేయాలా? వద్దా? అనే అంశంపై చర్చించారు. మందుపై కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని, ఐసీఎంఆర్ బృందాన్ని కృష్ణపట్నం పంపి, దీనిపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆదేశించారు. ఈ మేరకు ఐసీఎంఆర్ బృందాలు కృష్ణపట్నం చేరుకున్నాయి.
కృష్ణపట్నంలో శుక్రవారం నుంచి ఆయుర్వేద మందును పంపిణీ చేస్తారని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దాదాపు 40 నుంచి 60 వేల మంది చేరుకున్నట్టు సమాచారం. దీంతో క్యూలైన్లలో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకున్నది. మందు పంపిణీకి అధికారులు తొలుత అనుమతించలేదు. అనంతరం గందరగోళం మధ్య పంపిణీ ప్రారంభమైనప్పటికీ, కొద్దిసేపటికే తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఔషధం కోసం వచ్చినవారు నిరాశగా వెనుదిరిగారు. అక్కడకు వచ్చినవారిలో ఎక్కువమంది పాజిటివ్ బాధితులు ఉండటంతో పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేశారని వస్తున్న వార్తలను నెల్లూరు ఎస్పీ ఖండించారు. ఆయనకు భద్రత కల్పించామన్నారు. ఈ మందుపై పరిశోధన ముగిశాకే తిరిగి పంపిణీ ప్రారంభిస్తామని నెల్లూరు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు తెలిపారు.
బొనిగి ఆనందయ్య తయారుచేసిన మందును శాస్త్రీయంగా అన్ని విధాలుగా పరిశీలిస్తామని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఈ మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవని ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిందన్నారు. అయితే, మందు తయారీ విధానంపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. మందుకు చట్టబద్ధత కల్పిస్తే ఎక్కువమందికి ఉపయోగించే అవకాశం ఉంటుదని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ మందు వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవని ఆయుష్శాఖ నిర్ధారించిన వెంటనే దీనిని పంపిణీ చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి చెప్పారు. ప్రజలు ఆందోళన చెందకుండా సంయమనం పాటించి, సహకరించాలని కోరారు.