ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం l రెండు సీట్లలో 4,5 స్థానాల్లో హస్తం పార్టీ
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందా? ప్రజల్లో ఆ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్నదా? అంటే తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత వరుసగా ఎదురవుతున్న ఘోర ఓటములతో ఇప్పటికే పతనావస్థకు చేరిన పార్టీని.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికలు పాతాళంలోకి నెట్టివేశాయి. ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపకుండా పూర్తిగా చతికిలపడిపోయింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గంలో నాలుగో స్థానంలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో ఐదో స్థానంలో నిలిచి పరాభవాన్ని మూటగట్టుకుంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్లో పోటీ చేసిన రాములు నాయక్ 27వేల ఓట్లు మాత్రమే సాధించగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ అభ్యర్థిగా నిలిచి చిన్నారెడ్డి 32వేల ఓట్లు తెచ్చుకున్నారు. ప్రధాన పార్టీలను పక్కన పెడితే కనీసం స్వతంత్ర అభ్యర్థులకు కూడా వీరు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు.
వరుస ఓటములు… పతనానికి నాంది
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు పదేండ్లపాటు ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చెలాయించిన హస్తం పార్టీ ఆ తరువాత వరుసగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడా తన సత్తా చాటలేకపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఒకే ఒక్క స్థానం గెలుచుకొని తన ఉనికిని ప్రశ్నార్థకం చేసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమితో విద్యావంతుల్లోనూ ఆ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో ఆ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచి నడిపించే నాయకత్వం లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. దీంతో చాలామంది నేతలు ఇతర పార్టీల్లోకి వలసలుపోయారు. కార్యకర్తలకు సైతం పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో వారు కూడా వేరే దారులు వెతుక్కుంటున్నారు.
ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: చిన్నారెడ్డి
ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన ఆయన కేవలం 32వేల ఓట్లు మాత్రమే సాధించి నాలుగో స్థానంలో నిలిచారు.