హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): గణితశాస్త్రంలో అదొక అపరిష్కృత సిద్ధాంతం.. 161 ఏండ్లుగా అది చిక్కుముడిగానే మిగిలింది.. ఏ గణిత శాస్త్రవేత్త దాన్ని పరిష్కరించే సాహసం చేయలేకపోయారు.. అంతటి క్లిష్ట సమస్యగా ఉన్న ‘రీమన్ దత్తాంశం (రీమన్ హైపోథీసిస్)’ సిద్ధాంతాన్ని పరిష్కరించి చూపించారో హైదరాబాదీ ప్రొఫెసర్. ప్రస్తుతం హైదరాబాద్లోని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేస్తున్న కుమార్ ఈశ్వరన్ ఈ ఘనతను సాధించారు. జర్మనీకి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడ్రిచ్ గెస్ ఒక పరిశోధన వ్యాసంలో ఒక సంఖ్యకు దిగువన దాదాపుగా ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో గణించే సూత్రాన్ని రాశారు. అది శాస్త్రపరీక్షలో నిలబడలేదు. మరో ప్రఖ్యాత జర్మనీ గణితశాస్త్రవేత్త జార్జ్ ఫ్రెడ్రిచ్ బెర్న్హార్డ్ రీమన్ (1826-1866) ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి ‘జెటా ఫంక్షన్’ సాయంతో ప్రధాన సంఖ్యల సంఖ్యను గుర్తించవచ్చని ప్రతిపాదించారు. ‘జెటా ఫంక్షన్ శూన్యస్థానాలు లేదా మూలాలన్నీ సంకీర్ణ లేదా జంట తలంలో x = 1/2 అనే రేఖ మీద గుమిగూడి ఉంటాయి’ అని రీమన్ ప్రతిపాదించారు. దీనినే రీమన్ దత్తాంశం (రీమన్ హైపోథీసిస్) అని పిలుస్తారు. ఇది వాస్తవమే అని రుజువు కాలేదు. 2000 సంవత్సరంలో అమెరికాకు చెందిన ‘క్లే మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్’ అనే సంస్థ రీమన్ సిద్ధాంతాన్ని రుజువు చేసినవారికి మిలియన్ డాలర్లు (సుమారు రూ.7.4 కోట్లు) బహుమానంగా ఇస్తామని ప్రకటించింది. ఈ సిద్ధాంతాన్ని కుమార్ ఈశ్వరన్ రుజువు చేశారు. ఈ సంస్థ గతేడాది జనవరిలో ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 1,200 మంది గణిత నిపుణులు కుమార్ ఈశ్వరన్ సిద్ధాంతాన్ని సమీక్షించారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఏడాది మే 16న నిపుణుల కమిటీ సమావేశమై కుమార్ ఈశ్వరన్ ఆధారాలు రీమన్ దత్తాంశాన్ని నిరూపిస్తున్నాయని ప్రకటించింది. ఈ ఘనత సాధించడం పట్ల కుమార్ ఈశ్వరన్ను శ్రీనిధి గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ మహె ప్రశంసించారు. ఆయన విజయం తోటి గణిత శాస్త్రవేత్తల్లో, యువ పరిశోధకుల్లో మరింత స్ఫూర్తిని నింపుతుందని అన్నారు. గొప్ప భారతీయ గణిత శాస్త్రవేత్తల జాబితాలో కుమార్ ఈశ్వరన్ కూడా చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.