హైదరాబాద్ సిటీబ్యూరో/మన్సూరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రంగురాళ్ల వ్యాపారినంటూ జనాన్ని మోసగిస్తున్న జ్యోతిష్యుడికి ‘రంగు’పడింది. ఖరీదైన రంగారాళ్లు చోరీకి గురయ్యాయం టూ ఆయన చేసిన ఫిర్యాదుపై ఆరాతీస్తే నకిలీ నోట్ల గుట్టు రట్టయింది. ఈ వ్యవహారంపై రాచకొండ సీసీఎస్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు జరిపి ఏడుగురిని అరెస్టుచేశారు. వారినుంచి దాదాపు రూ.18 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకొన్నారు. రాచకొండ క్రైమ్ డీసీపీ యాదగిరి వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన బెల్లంకొడ మురళీకృష్ణశర్మ హైదరాబాద్లోని నాగోల్ బృందావన్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. తాను జ్యోతిష్యుడినని చెప్పి రంగురాళ్ల వ్యాపారం చేస్తున్నట్లు ప్రచారం చేసుకొన్నాడు. దీంతోపాటు ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్నట్లు కూడా నమ్మబలికాడు.
ఈక్రమంలో మురళీకృష్ణకు బంధువు నాగేంద్రప్రసాద్ ద్వారా పరిచయమైన పవన్ అనే వ్యక్తిని ఉద్యోగంలో పెట్టుకున్నాడు. తన వద్ద భారీగా నగదు ఉన్నదని మురళీకృష్ణ చాలామందికి చూపిస్తుండటంతో ఆ డబ్బును కాజేయాలని పవన్కు ఆశ పుట్టింది. ఈ విషయాన్ని నాగేంద్రప్రసాద్తోపాటు తన స్నేహితులు డీ రామకృష్ణ, ఎన్ సురేశ్గోపి, కే సూర్యం, సీహెచ్ విజయ్కుమార్కు చెప్పి చోరీకి స్కెచ్వేశాడు. అనంతరం ఈ నెల 15 రాత్రి 10:15 గంటలకు వీరంతా మురళీకృష్ణ ఇంట్లోకి ప్రవేశించి రెండు బ్యాగ్లలో ఉన్న నగదుతో ఉడాయించారు. చౌటుప్పల్ దాటిన తర్వాత ఆ బ్యాగ్ల్లోని నగదును తనిఖీ చేయగా కేవలం 16 నోట్లే అసలైనవని, మిగిలినవి నకిలీ నోట్లని తేలింది. దీంతో వాటిని వాడపల్లి వద్ద తగలబెట్టారు. మరోవైపు తన ఇంట్లో రంగురాళ్లతోపాటు కొంత నగదు చోరీ జరిగిందంటూ మురళీకృష్ణ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దర్యాప్తు జరిపి పోలీసులు బుధవారం పవన్తోపాటు ఐదుగురిని పట్టుకొన్నా రు. మురళీకృష్ణ ఇంట్లో చోరీచేసింది నకిలీ కరెన్సీ అని వారు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. మురళీకృష్ణను ప్రశ్నించడంతో నకిలీ కరెన్సీతో చేస్తు న్న మోసాలు బట్టబయలయ్యాయి. మురళీకృష్ణను అరెస్టు చేసి 17.72 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ, రూ.6 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.
ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ వ్యవహరంలో మురళీకృష్ణపై గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. మోసపూరితంగా ఆయన రూ.100 కోట్లు కూడబెట్టినట్లు తేలడంతో ఆ నగదును ఫ్రీజ్ చేసింది. అయినప్పటికీ మురళీకృష్ణ తన బ్యాంకు ఖాతాలో రూ.100 కోట్లు ఉన్నాయని నమ్మబలుకుతూ చాలామంది నుంచి లక్షల రూపాయలను కాజేసి జల్సా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.