ఈ లవ్స్టోరీ కల్పితం కాదు. ఇది సినిమా కథ అసలే కాదు. కానీ, అంతకు మించి ట్విస్టులు ఉన్నాయి. ప్రేమించిన యువతి కోసం పాదయాత్రగా దేశాలు దాటే సాహసానికి ఒడిగట్టిన రియల్స్టోరీ. వీసా, పాస్పోర్ట్, చేతిలో రూపాయి లేకున్నా స్విట్టర్లాండ్కు బయలుదేరి పాకిస్థాన్ ఆర్మీకి పట్టుబడి నాలుగేండ్ల తర్వాత ఇంటికి చేరుకున్న ఓ భగ్నప్రేమికుడి కథ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ):ప్రియురాలి కోసం వెళ్తూ పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న హైదరాబాద్ యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు విడుదలయ్యాడు. వాఘా సరిహద్దులో పాక్ అధికారులు ప్రశాంత్ను భారత అధికారులకు అప్పగించగా, మంగళవారం మాదాపూర్ పోలీసులు అతడిని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హైదరాబాద్కు చెందిన ప్రశాంత్ కొంతకాలం కిందట బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశాడు. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన యువతిని ప్రేమించాడు. కానీ ఆ విషయం ఆమెకు చెప్పలేదు. ఇంతలోనే ఆమె స్విట్జర్లాండ్ వెళ్లిపోయింది. తర్వాత ప్రశాంత్ ఉద్యోగం హైదరాబాద్కు మారినప్పటికీ ఆమె ధ్యాసలోనే గడిపేవాడు. 2017 ఏప్రిల్లో ఎలాగైనా యువతిని కలువాలని నిర్ణయించుకున్నాడు. వీసా, పాస్పోర్ట్, చేతిలో డబ్బు లేకున్నా హైదరాబాద్ నుంచి స్విట్జర్లాండ్కు పాకిస్థాన్ మీదుగా 7,400 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. టికెట్ లేకుండా హైదరాబాద్లో రైలెక్కి రాజస్థాన్ చేరుకొని సరిహద్దులో కంచెదాటి పాకిస్థాన్ ఆర్మీకి చిక్కాడు. ఏడాది కిందట పాక్ జైల్లో ఉన్నట్టు ప్రశాంత్ వీడియో బయటికి రావడంతో తల్లిదండ్రులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సైబరాబాద్ పోలీసుల కృషితో ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా తన అనుభవాలను ‘నమస్తే తెలంగాణ’ క్రైం ప్రతినిధికి వివరించారు.
వ్యక్తిగత కారణంతో స్విట్జర్లాండ్ వెళ్లేందుకు 2017 ఏప్రిల్కు రెండు నెలల నుంచే ప్లాన్ చేసుకున్నా. మొత్తం పాదయాత్ర, లిఫ్ట్లతో కలిపి 61 రోజుల ప్రోగ్రాం. హైదరాబాద్ టు స్విట్జర్లాండ్ వయా పాక్తిస్థాన్ 7,400 కిలోమీటర్లు. చేతిలో డబ్బుల్లేవు. కేవలం కోఠిలో కొన్న దిక్సూచి యంత్రం, రూట్మ్యాప్ ప్రింట్ తప్ప. ఈ విషయాన్ని అమ్మ పసిగట్టి బయటికి రానివ్వలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ రోజు బయటికి వచ్చా. హైదరాబాద్లో రైలు ఎక్కి రాజస్థాన్లోని బికనీర్ వరకు టికెట్ లేకుండా వెళ్లా.
బికనీర్లో ఓ స్థానికుడిని పాక్ సరిహద్దుకు దారి అడిగా. అక్కడికి వెళ్తే కాల్చి చంపేస్తారని హెచ్చరించాడు. అయినా ముందడుగు వేశా. సరిహద్దులో మూడంచెల ఫెన్సింగ్. ముందుగా మన కంచెను ఎక్కి దూకాను. తర్వాత ఇరుదేశాల సరిహద్దు కంచె వరకు వెళ్లా. అదీ దూకేశా. తర్వాత పాక్ సరిహద్దులో ఉన్న కంచెను ఎక్కి దూకేటప్పుడు నా అంగీ చిరిగిపోయింది. అప్పటికి సమయం మధ్యాహ్నం ఒంటిగంట. తినేందుకు ఏమీలేదు. వాటర్బాటిల్లోని నీళ్లు కూడా అయిపోయాయి. మండుటెండలో 40 కిలోమీటర్లు నడిచా. ఇక నడవడానికి ఓపిక లేక ఓ గుడిసెలోకి వెళ్లి పడిపోయా. అప్పుడు పాక్ ఆర్మీ అధికారులు చూశారు.
నన్ను భారత గూడఛారిగా అనుమానించారు. ఎందుకు వచ్చావో చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. కానీ నాది ఒకటే మాట.. నేను స్విట్జర్లాండ్కు వెళ్లాలి. ఇలా మూడేండ్లు పాక్ ఆర్మీ అధికారులు దర్యాప్తు చేశారు. ఎన్నిసార్లు అడిగినా నా దగ్గర ఒకే సమాధానం రావడంతో నేను గూడఛారిని కాదని నమ్మారు. దీంతో పాక్ పోలీసులకు అప్పగించారు. వారు పాక్ కంట్రోల్-1952 యాక్ట్ కింద కేసు నమోదుచేసి ఏడాది శిక్ష ఖరారు చేశారు.
లాహోర్ కోర్టులో ఉన్నప్పుడు అక్కడి పోలీసు అధికారి నా ఆవేదనను చూసి నేను క్షేమంగా ఉన్నట్టు వీడియో రికార్డుచేసి సోషల్మీడియాలో పోస్ట్చేశారు. అది వైరల్గా మారి నా తల్లిదండ్రులు చూసి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. నాలాగా చాలామంది భారతదేశానికి చెందిన ఖైదీలు ఉన్నారు. వారిని విడిపించేందుకు కేంద్రప్రభుత్వం కృషిచేయాలి. పాక్ అధికారులు చాలా మంచోళ్లు.
ప్రతిరోజు 108 సార్లు హరేకృష్ణ అని స్మరించుకునేవాడిని. యోగా, మెడిటేషన్ చేశాను. తోటి ఖైదీ ఇచ్చిన జావా పుస్తకాన్ని చదివి పూర్తి జ్ఞానాన్ని సంపాదించా. నేను క్షేమంగా వచ్చానంటే అది దేవుడి అశీర్వాదమే.
తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ పోలీసులు, కేంద్రం, హోం, విదేశాంగశాఖ అధికారుల కృషికి పాదాభివందనాలు. సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా రెండుసార్లు ఢిల్లీకి వచ్చి నా విడుదలకు సంబంధించిన అంశాలపై ప్రయత్నాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి, సైబరాబాద్ పోలీసులకు రుణపడి ఉంటా. పాక్ అధికారులు ఇండియాకు అప్పగించిన తర్వాత ఢిల్లీ నుంచి రాష్ట్ర పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు.
తిరిగి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటా. ఇంట్లో పెద్దలు, అమ్మనాన్న, సోదరుడి మాట వింటా. ఇకపై తొందరపడను. ఎవరైనా సరే, పెద్దల మాట వింటే జీవితం సంతోషంగా ఉంటుంది.