రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా పురోగమిస్తున్నది. నగరంలో భాగంగా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. మారుతున్న పరిస్థితులకనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను సమగ్రంగా అభివృద్ధి పరుచుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. హైదరాబాద్తోపాటు సమ్మిళితాభివృద్ధిని కొనసాగించేలా విస్తృత పరిధిలో ఒక సమీకృత విధానాన్ని రూపొందించుకోవాలి.
–సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు అభివృద్ధిలో హైదరాబాద్తో పోటీ పడుతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో భాగంగా ఉన్న ఈ జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సమీకృత అభివృద్ధి జరుగాలని, సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకోసం సీఎస్ సోమేశ్కుమార్ నేతృత్వంలో నోడల్ ఏజెన్సీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. తద్వారా సమీప భవిష్యత్తులో ఈ రెండు జిల్లాల్లో శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణాలు ఊపందుకొని, అత్యంత సుందరంగా రూపుదిద్దుకుని హైదరాబాద్ ముఖచిత్రాన్ని మరింత గుణాత్మకంగా మార్చివేయడం ఖాయమన్నారు. ‘రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారం, భవిష్యత్ అవసరాలను అంచనావేస్తూ మౌలిక వసతుల సమగ్రాభివృద్ధి కోసం ఏకీకృత విధానాన్ని అమలుపరచడం’ అనే అంశంపై శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి సమీకృత విధానాన్ని అనుసరించాలని సీఎం సూచించారు.
నోడల్ ఏజెన్సీ ఏర్పాటుచేయాలి
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేకంగా నోడల్ ఏజెన్సీ ఏర్పాటు, అవసరం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశంలో విశదీకరించారు. ‘హైదరాబాద్ కాస్మొపాలిటన్ నగరంగా పురోగమిస్తుండగా.. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను సమగ్రంగా అభివృద్ధి పరుచుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. హైదరాబాద్ నగరంతోపాటు సమ్మిళితాభివృద్ధిని కొనసాగించేలా విస్తృత పరిధిలో ఒక సమీకృత విధానాన్ని రూపొందించుకోవాలి’ అని పేర్కొన్నారు. ఈ పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు సీఎస్ సోమేశ్కుమార్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీని ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ జిల్లాల్లోని ప్రజలకు హైదరాబాద్లో మాదిరి విద్య, వైద్యం వంటి అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తేవాల్సి ఉన్నదని చెప్పారు.
ఇందుకోసం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఒక ప్రాజెక్టు రూపంలో తయారుచేయాలని సూచించారు. మౌలిక వసతుల అభివృద్ధికి ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వాటి పరిష్కారానికి నోడల్ అధికారి అధ్యక్షతన తరచూ సమావేశం కావాలని సూచించారు. ఇందులో ఏయే శాఖలు భాగస్వామ్యం కావాల్సిఉన్నది? ఎంత ఖర్చవుతుంది? తదితర అంశాలన్నింటినీ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి చర్చించుకోవాలని స్పష్టంచేశారు. ప్రజాప్రతినిధులు నెలకొకసారి సీఎస్తో క్రమం తప్పకుండా సమావేశం కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని నోడల్ అధికారి ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు.
హైదరాబాద్ తరహా సదుపాయాలు
రెండు జిల్లాల్లో హైదరాబాద్ తరహాలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ‘హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. అత్యద్భుతమైన వాతావరణ పరిస్థితులున్నాయి. నిరంతరం తాగునీటిని అందించేందుకు అటు గోదావరి ఇటు కృష్ణా జలాలను నింపుకొనేందుకు అతిపెద్ద రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకొంటున్నం’ అని చెప్పారు. రెండు జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, ఇతర ముఖ్యపట్టణాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకోసం ఇప్పటికే జనాదరణ పొందిన బస్తీ దవాఖానలను ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రజల ఆహార అవసరాలను గుర్తించి వారికి పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు వంటి ఆహారాన్ని అందుబాటులోకి తెస్తూ, గృహిణులకు అందుబాటులో ఉండేలా విశాలమైన స్థలాలను ఎంపికచేసి.. వెజ్, నాన్వెజ్ సమీకృత మార్కెట్లను ఏర్పాటుచేయాలని తెలిపారు.
నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందుబాటులో ఉంచడం, టౌన్హాళ్ల నిర్మాణం, పటిష్ఠంగా రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడటం, వరదల నివారణ, ముంపు సమస్యలను అధిగమించడం, సీవరేజీ డ్రైనేజీ, నాలాల మరమ్మతువంటి పనులతోపాటు, రెవెన్యూ, భూ రిజిస్ట్రేషన్ తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలని ఆదేశించారు. తద్వారా ఈ రెండు జిల్లాలు భవిష్యత్తులో హైదరాబాద్తో పోటీపడుతూ అభివృద్ది చెందుతాయని, శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం ఊపందుకొని, భవిష్యత్తులో హైదరాబాద్ ముఖచిత్రాన్ని మరింత గుణాత్మకంగా మార్చివేయడం ఖాయమని సీఎం అన్నారు.
సమాంతరంగా అభివృద్ధి
రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, పెద్ద అంబర్పేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, శంకర్పల్లి, తుక్కుగూడ, ఆమన్గల్ మున్సిపాలిటీలు, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, జిల్లెలగూడ కార్పొరేషన్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, నిజాంపేట కార్పొరేషన్లు, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ తదితర మున్సిపాలిటీల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ ప్రాంతాలన్నీ హైదరాబాద్ నగరంలో దాదాపు కలిసిపోయాయని చెప్పారు. వివిధ ప్రాంతాలనుంచి జీవనోపాధి వెతుక్కొంటూ, ఉద్యోగాల నిమిత్తం వచ్చిన తెలంగాణ సహా ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిరపడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు రచించాలని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించిన నిధులను సమీకరించడం, నోడల్ ఏజెన్సీ ఏర్పాటుచేసి నగరం
నలువైపులా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం కీలకమని చెప్పారు. అన్నిదిక్కుల్లో అన్నిరకాల పనులు సమాంతరంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. త్వరలో ఈ ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు సహా విద్య, వైద్యం, విద్యుత్, మున్సిపల్ శాఖలు, మిషన్ భగీరథ, తదితర మౌలిక వసతుల కల్పనలో భాగస్వామ్యం అయ్యే వివిధ ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, నవీన్రావు, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బేతి సుభాష్రెడ్డి, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, కాలె యాదయ్య, మాధవరం కృష్ణారావు, సీఎస్ సోమేశ్కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు, కార్యదర్శి భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి
ఎముకలు బలంగా కావాలా? ఇవి తినండి
450 మంది టూరిస్టులను రక్షించిన భారత జవాన్లు
థర్మల్ పవర్ ప్లాంట్లకు కొత్త నిబంధనలు