హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): గులాబ్ తుఫాన్ ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లో కుండపోత కురిసింది. ఆదివారం రాత్రి మొదలైన వర్షం సోమవారం రోజంతా కొనసాగింది. సాయంత్రానికి మరింత ఊపందకున్నది. నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చాలాచోట్ల రహదారులపై నీరు పోటెత్తింది. కాలనీలు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళ, బుధవారాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి.
అవసరమైతే లోతట్టు ప్రాంతాలవారిని, పురాతన కట్టడాలకు సమీపంలో ఉన్నవారిని తరలించేందుకు 30 పునరావాస కేంద్రాలు, 170 మాన్సూన్ టీమ్లు, 92 స్టాటిస్టిక్స్ బృందాలను సిద్ధంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం గ్రేటర్ పరిధిలోని మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీలో అన్నిస్థాయిల అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేస్తున్నట్టు కమిషనర్ లోకేష్కుమార్ ప్రకటించారు. సంబంధిత అధికారులకు సమాచారం లేకుండా ప్రజలు ఎక్కడపడితే అక్కడ మ్యాన్హోల్ మూతలు తీయొద్దని జలమండలి ఎండీ దానకిషోర్ ప్రజలను కోరారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ ప్రజలకు సూచించారు.
మూసీ పరివాహక ప్రాంతంలో అప్రమత్తం
హైదరాబాద్లోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుండటంతో గేట్లను ఎత్తి, మూసీ నదిలోకి నీటిని వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని బస్తీలు, కాలనీల ప్రజలను అప్రమత్తం చేశారు. గతంలో తెగిన చెరువుల వద్ద పరిస్థితిని ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బలహీనంగా ఉన్న చెరువుల కట్టలకు మరమ్మత్తు చేస్తున్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను గుర్తించి, వారిని అప్రమత్తం చేస్తున్నారు. రిజర్వ్ పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు.
నేడు, రేపు భారీ వర్షాలు
గ్రేటర్ హైదరాబాద్లో రాగల రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం రాత్రి హెచ్చరికలు జారీచేసింది. చాలాచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు, కొన్నిచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వెల్లడించింది.