హైదరాబాద్: కరోనా వ్యాప్తిని కట్టడిచేయడానికి విధించిన లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజులు పొడిగించింది. అదే సమయంలో సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు సాయంత్రం 6 గంటల వరకు వెసులుబాటు కల్పించింది. మరో పది రోజులపాటు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోరైల్ పనివేళల్లో మార్పులు చేశారు. లాక్డౌన్ సడలింపుతో మెట్రో సేవల సమయాన్ని అధికారులు పొడిగించారు. రేపటి నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. అన్ని చివరి స్టేషన్ల నుంచి సాయంత్రం 5 గంటలకు ఆఖరి రైలు బయల్దేరుతుందని మెట్రో అధికారులు ప్రకటించారు.