ఒకవైపు కరోనా భయం. మరోవైపు వర్క్-ఫ్రమ్-హోమ్తో పనిలో ఉక్కిరిబిక్కిరి. అంతలోనే ఉద్యోగ అభద్రత. ఇలా రకరకాల కారణాలతో చాలామంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడివల్ల మానసిక సమస్యలతోపాటు శారీరక సమస్యలు వస్తాయని మనకు తెలుసు. కానీ, దంత సమస్యలూ తలెత్తుతాయని ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. ఉదయం నిద్ర లేవగానే పంటినొప్పి లేదా దవడ నొప్పి ఇబ్బంది పెడుతున్నదంటే, రాత్రిపూట ఏదో ఆలోచిస్తూ పటపటా పళ్లు కొరుకుతున్నారని అర్థం. దీనికికూడా ఒత్తిడే కారణమని తేలింది. మొదటి లాక్డౌన్ సమయంలో 10నుంచి 36శాతం మంది రాత్రిళ్లు రకరకాల ఆలోచనలు, ఒత్తిళ్లతో పళ్లు కొరికేవారని, ఆ రాపిడికి దంతాలు బలహీనపడే ప్రమాదం ఏర్పడిందని తేల్చారు. ఎందుకైనా మంచిది, ఒత్తిడి జీవులు రాత్రిళ్లు నిద్రపోయే ముందు మౌత్ గార్డ్ వాడటం మంచిదని డెంటిస్ట్లు సూచిస్తున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం, ధ్యానం, డీప్ బ్రీతింగ్ సిఫారసు చేస్తున్నారు. టీవీల్లో కామెడీ షోలు, పాత సినిమాలు చూడటమూ ఓ మార్గమేనంటున్నారు.