హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ శిక్షణతోపాటు నియామకాల్లోనూ హైదరాబాద్ గణనీయ అభివృద్ధి సాధించింది. కరోనా వల్ల తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశంలో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో జరిగిన ఐటీ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్, పుణె నగరాలు చెరో 18 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో బెంగళూరు 40 శాతం నియామకాలతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఐటీ నియామకాల్లో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై లాంటి ప్రముఖ నగరాలు చాలా వెనుకబడి ఉన్నాయని తాజా నివేదికలో క్వెస్ సంస్థ స్పష్టం చేసింది. బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాల్లోనే దాదాపు 400% వరకు ఉద్యోగావకాశాలు పెరిగినట్టు ఆ నివేదికలో వెల్లడింది. దేశీయ ఐటీ రంగంలో ప్రధానంగా బెంగళూరుతో పోటీపడుతున్న హైదరాబాద్ పలు జాతీయ, అంతర్జాతీయ ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలను విశేషంగా ఆకర్షిస్తున్నది. పెట్టుబడులకు హైదరాబాద్లో ఎంతో అనువైన వాతావరణం ఉండటంతో ఇప్పటికే అనేక కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఫలితంగా గత రెండేండ్లలో హైదరాబాద్లో ఐటీ ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరిగినట్టు క్వెస్ వెల్లడించింది. ఏడాది క్రితం హైదరాబాద్లో 5.50 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 6.20 లక్షలకు పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వివిధ విభాగాల్లో హైదరాబాద్ సత్తా
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఐటీ ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ పలు విభాగాల్లో సత్తా చాటింది. డాటా ఎనలిటిక్స్ విభాగంలో 40%, ఫుల్ స్టాక్ డెవలపర్స్ విభాగంలో 37%, క్లౌడ్ టెక్ డెవలపర్ల విభాగంలో 26% నియామకాలు హైదరాబాద్లోనే జరగడం విశేషం. వీటితో పాటు గేమింగ్, యూనిటీ డెవలపర్స్, సేల్స్ఫోర్స్, సాప్ హనా లాంటి విభాగాల్లో కూడా హైదరాబాద్లో చాలా మందికి ఉద్యోగాలు లభించాయి. గత రెండు, మూడేండ్ల నుంచి హైదరాబాద్లో అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను భారీస్థాయిలో విస్తరిస్తుండటమే ఇందుకు కారణమని క్వెస్ వెల్లడించింది.
ఉద్యోగావకాశాలు కల్పించిన ప్రముఖ కంపెనీలు
కరోనా సమయంలో చాలా ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకున్నాయి. వీటిలో టీసీఎస్, యాక్సెంచర్, ఓరాకిల్, కాగ్నిజెంట్, సిటీ, ఉబర్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్టీఐ, వీఎంవేర్, హర్మాన్ ఇంటర్నేషనల్, ఐడీఎం, విప్రో, జెన్ప్యాక్ట్, జెపీ మోర్గాన్ చేస్, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గో, ఫ్లిప్కార్ట్, ఇన్ఫోసిస్ లాంటి పలు ప్రధాన కంపెనీలు ఉన్నట్టు ఉద్యోగుల నియామక సంస్థ ఎక్స్ఫినో వెల్లడించింది.
ఇంటి నుంచి పని.. మెరుగైన పనితీరు
కొవిడ్ఆలంలో ఐటీ రంగం అద్భుత వృద్ధిరేటు సాధించింది. ఉద్యోగులు ఇంటి నుంచి కూడా ఎంతో మెరుగ్గా పనిచేయడమే ఇందుకు కారణం. వివిధ రంగాలకు చెందిన కంపెనీలు క్లౌడ్ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్కు ప్రాధాన్యమివ్వడంతో ఉద్యోగాలు విపరీతంగా పెరిగాయని చెప్పవచ్చు.